

వియత్నాంలోని ఫు క్వోక్ దీవి సమీపంలో జరిగిన బోటు ప్రమాదం తమిళనాడులో విషాదాన్ని నింపింది. ప్రమాదంలో ఎక్కువ మంది తమిళనాడుకు చెందినవారే ఉండటంతో అనేక కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ దిండుక్కల్ జిల్లా పళనికి చెందిన నిర్మల్ కుమార్ తన భయానక అనుభవాన్ని వివరించారు.
మొబైల్ ఫోన్ పంపిణీదారుల కోసం నిర్వహించిన ఇన్సెంటివ్ ట్రిప్లో భాగంగా జూలై 8న వియత్నాం వెళ్లామని ఆయన తెలిపారు. జూలై 11న మొత్తం 36 మంది స్పీడ్బోటులో ఫు క్వోక్ దీవి సందర్శించి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా వాతావరణం మారి, బలమైన గాలులు, భారీ అలల కారణంగా బోటు తలకిందులైందని చెప్పారు. క్షణాల్లోనే ప్రయాణికులు సముద్రంలో పడిపోవడంతో భయానక పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు.
రక్షణ బృందాలు వెంటనే సహాయక చర్యలు చేపట్టడంతో తాను ప్రాణాలతో బయటపడ్డానని, అయితే తనతో వచ్చిన స్నేహితుడు మురుగప్రభు మృతి చెందిన విషయం తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని నిర్మల్ కుమార్ తెలిపారు. ప్రయాణానికి ముందు లైఫ్ జాకెట్లు, భద్రతా సూచనలు ఇచ్చారని, ప్రమాదానికి అసలు కారణాలపై విచారణ కొనసాగుతోందన్నారు. వాతావరణ మార్పులు, భారీ అలలు, బోటులో అధిక సంఖ్యలో ప్రయాణికులు ఉండటం ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!