

వొడాఫోన్ ఐడియా (Vi)పై భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియోలు లేవనెత్తిన అభ్యంతరాలను పరిశీలిస్తామని టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ తెలిపింది. ఈ మేరకు ట్రాయ్ చైర్మన్ ఏకే లహోటీ సోమవారం వెల్లడించారు. ఏ టెలికం ఆపరేటర్ నుంచి అయినా ఆందోళనలు లేదా అభ్యంతరాలు వచ్చినప్పుడు వాటిని పరిశీలించడం తమ బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై తదుపరి చర్చల కోసం మూడు టెలికం సంస్థల ప్రతినిధులను పిలుస్తారా? అనే దానిపై మాత్రం ఆయన స్పష్టత ఇవ్వలేదు.
వొడాఫోన్ ఐడియా తమ నెట్వర్క్కు పోర్ట్ అయ్యేలా వినియోగదారులను ప్రోత్సహిస్తోందని ఎయిర్టెల్, జియో ఆరోపించాయి. పోర్టింగ్ చేసుకునే కస్టమర్లకు ప్రత్యేక ప్రయోజనాలు అందించడం, నెట్వర్క్ మార్పును ప్రోత్సహించేలా ప్రత్యేక టారిఫ్లను ప్రకటించడం టెలికం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ట్రాయ్ను ఆశ్రయించాయి. ఈ ఆరోపణలపై స్పందించిన వొడాఫోన్ ఐడియా.. పోటీలో నైతిక ప్రమాణాలను పాటించడాన్ని తాము విశ్వసిస్తామని తెలిపింది. తమ ఉత్పత్తులు, కస్టమర్లకు అందించే ప్రయోజనాలపై నమ్మకం ఉందని, తాము ఎల్లప్పుడూ చట్టబద్ధంగానే కార్యకలాపాలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!