

కలియుగ వైకుంఠం తిరుమలలో బ్రహ్మోత్సవాల వేళ మహాగోపురంపై కనిపిస్తున్న ఓ దృశ్యం భక్తుల్లో ఆందోళన కలిగిస్తోంది. మహాగోపురంపై ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహానికి చేయి విరిగినట్లు కనిపించడంతో ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. బ్రహ్మోత్సవాల కోసం ఆలయానికి రంగులు వేస్తూ, సుందరంగా తీర్చిదిద్దుతున్న సమయంలోనే విగ్రహం దెబ్బతిన్న స్థితిలో కనిపించడంతో టీటీడీ అధికారులు దీన్ని ఎలా గుర్తించలేకపోయారనే ప్రశ్నలు భక్తుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ విగ్రహం ముందే దెబ్బతిందా? లేక మరమ్మతులు, పెయింటింగ్ పనుల సమయంలోనే నష్టం జరిగిందా? అన్నది తేలాల్సి ఉంది.
బ్రహ్మోత్సవాలకు ముందు ఆలయ పరిసరాల్లో మరమ్మతులు, రంగుల పనులు చేపట్టే క్రమంలో మహాగోపురంపై ఉన్న విగ్రహాల పరిస్థితిని కూడా పూర్తిగా పరిశీలించాలని భక్తులు కోరుతున్నారు. విరిగిన భాగం కిందకు పడితే భక్తుల భద్రతపై ప్రభావం ఉంటుందా? అనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విగ్రహం ఎప్పుడు దెబ్బతింది, కారణం ఏమిటి, మరమ్మతులు ఎప్పుడు చేపడతారు అనే అంశాలపై టీటీడీ అధికారికంగా స్పష్టత ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!