

హైదరాబాద్లోని కీలకమైన చంచల్గూడ–సంతోష్నగర్ స్టీల్ ఫ్లైఓవర్ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రూ.620 కోట్ల వ్యయంతో 3.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ ఫ్లైఓవర్ను ప్రారంభించిన అనంతరం, డిజైన్ల ఫోటో ప్రదర్శనను పరిశీలించిన సీఎం ప్రజాప్రతినిధులతో కలిసి ఓపెన్ టాప్ జీపులో ప్రయాణిస్తూ ఫ్లైఓవర్ను పరిశీలించారు. ప్రారంభోత్సవ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, గత ప్రభుత్వం కేవలం శంకుస్థాపన చేసి వదిలేసిందని, బ్రిడ్జి నిర్మాణానికి నిధులు ఖర్చు చేయలేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం నిధులు సమకూర్చి పనులను పూర్తి చేసిందన్నారు. “ఇది ఓల్డ్ సిటీ కాదు.. ఒరిజినల్ సిటీ” అని పేర్కొంటూ, ఈ ప్రాంతంలోని ప్రతి గల్లీ తనకు తెలుసన్నారు. అసదుద్దీన్ ఓవైసీ కోరిన అభివృద్ధి పనులకు అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే బలాలా కళాశాల అభివృద్ధికి కోరిన రూ.20 కోట్లకు బదులుగా రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
విద్యాభివృద్ధికి అవసరమైనంత నిధులు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం తెలిపారు. రాజకీయ సిద్ధాంతాలు వేర్వేరుగా ఉన్నప్పటికీ దేశభక్తి విషయంలో అందరూ ఒక్కటేనని, ఆపరేషన్ సింధూర్ సమయంలో అసదుద్దీన్ ఓవైసీ దేశానికి మద్దతుగా నిలిచారని గుర్తుచేశారు. మీరాలం చెరువులో మూడు కిలోమీటర్ల మేర కేబుల్ బ్రిడ్జి నిర్మిస్తామని, వచ్చే ఎన్నికల్లోగా గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో పనులు పూర్తి చేస్తామని చెప్పారు. హైదరాబాద్లో లక్ష ఇందిరమ్మ ఇళ్లు నిర్మించడంతో పాటు నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్రనగర్, శంషాబాద్ వరకు మెట్రోను విస్తరిస్తామని వెల్లడించారు. మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధి, నైట్ ఎకానమీ ద్వారా ఉపాధి అవకాశాలను పెంచుతామని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాజకీయాలు ఉంటాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత అభివృద్ధే అందరి లక్ష్యమని, హిందూ–ముస్లింలు కలిసి నడిస్తేనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!