

బీఆర్ఎస్ నేత హరీశ్రావు సనత్నగర్ టిమ్స్ ఆసుపత్రి ప్రారంభంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. టిమ్స్ ఆసుపత్రుల ఆలోచన, ప్రణాళిక, శంకుస్థాపన, నిధుల మంజూరు అన్నీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆయన పేర్కొన్నారు. అల్వాల్, సనత్నగర్, ఎల్బీనగర్లో ఒక్కోటి వెయ్యి పడకల సామర్థ్యంతో మూడు టిమ్స్ ఆసుపత్రులను ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించాలన్నది కేసీఆర్ ఆలోచన అని తెలిపారు. మూడు ఆసుపత్రుల నిర్మాణానికి అప్పటి ప్రభుత్వం రూ.2,679 కోట్లు మంజూరు చేసిందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణ పనులు నత్తనడకన సాగాయని హరీశ్రావు ఆరోపించారు. సనత్నగర్ ఆసుపత్రిని పూర్తిస్థాయి వైద్య, మౌలిక సదుపాయాలు లేకుండానే ప్రారంభిస్తున్నారని, కనీసం నీటి సరఫరా కూడా అందుబాటులో లేదని విమర్శించారు. పేదలకు ఉచిత వైద్యం అందించాల్సిన ఆసుపత్రులను ఆదాయ వనరులుగా మార్చవద్దని కోరారు. టిమ్స్, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, 2,000 పడకల నిమ్స్ కొత్త బ్లాక్ నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి ఉచిత వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!