

ఏలూరు జిల్లాలోని దేవాలయాల్లో ఆడిట్ అభ్యంతరాలు భారీగా పేరుకుపోయినట్లు సమాచారం. 2024-25 వరకు 154 ఆలయాలకు సంబంధించి రూ.86.21 కోట్ల విలువైన అభ్యంతరాలు నమోదైనట్లు తెలుస్తోంది. కామవరపుకోట, లింగపాలెం, కొయ్యలగూడెం, ముసునూరు, టి.నరసాపురం, ద్వారకాతిరుమల, మండవల్లి, జీలుగుమిల్లి తదితర మండలాల్లోని ఆలయాల్లో రూ.20 లక్షల నుంచి రూ.కోటి లోపు అభ్యంతరాలు ఉన్నట్లు సమాచారం. మిగిలిన మండలాల్లో కొన్ని ఆలయాలకు రూ.కోటికి మించిన అభ్యంతరాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు.
ప్రముఖ ఆలయాల్లో ఉత్సవాలు, కల్యాణాలు, అన్నదానం, పూజలు తదితర కార్యక్రమాలకు సంబంధించిన ఖర్చుల లెక్కలపై ఆడిట్ అభ్యంతరాలు వచ్చినట్లు సమాచారం. కొన్ని చోట్ల సిబ్బంది సంఖ్య, వారి వేతన చెల్లింపులపైనా ప్రశ్నలు తలెత్తినట్లు తెలుస్తోంది. అలాగే వ్యవసాయ భూముల కౌలు, దుకాణ సముదాయాల లీజుల ద్వారా రావాల్సిన ఆదాయం సక్రమంగా వసూలు కావడం లేదన్న అభ్యంతరాలు కూడా ఉన్నట్లు సమాచారం. పూలు, పండ్లు, పూజా సామగ్రి, విద్యుత్ అలంకరణలు, డెకరేషన్లకు సంబంధించిన ఖర్చులపైనా ప్రశ్నలు లేవనెత్తినట్లు తెలుస్తోంది. 6(ఏ), బీ, సీ, డీ కేటగిరీలకు చెందిన ఆలయాల్లో కలిపి 28,592 ఆడిట్ అభ్యంతరాలు నమోదయ్యాయని, వాటిలో సగానికి కూడా సమాధానాలు రాలేదని సమాచారం. ఈ పరిణామాలు ఆలయాల ఆర్థిక నిర్వహణ, ఆదాయ వసూళ్లు, ఖర్చుల పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!