

ఎల్నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు కార్యాచరణతో సిద్ధమవుతోందని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, డా. ధనసరి అనసూయ సీతక్క, వాకిటి శ్రీహరి తెలిపారు. రైతాంగానికి, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఎల్నినో ప్రభావం, వివిధ ప్రభుత్వ రంగాల్లో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై శుక్రవారం రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో రాష్ట్రస్థాయి వర్క్షాప్ నిర్వహించారు. ఎల్నినోను కేవలం విపత్తుగా చూడకుండా ముందస్తు ప్రణాళికతో ఎదుర్కొని, గ్రామాల అభివృద్ధికి అవకాశంగా మలుచుకోవాలని మంత్రులు సూచించారు.
గ్రామస్థాయిలో వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్థక, మత్స్య, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించి, తక్షణ అవసరాలతో పాటు వచ్చే ఐదు, పది సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులను ఎంపిక చేయాలని సూచించారు.
వీబీ-జీ రామ్జీ నిధులను ప్రణాళికాబద్ధంగా వినియోగించాలని, ఉపాధి హామీ నిధులతో శాశ్వత సామాజిక ఆస్తులను నిర్మించాలని మంత్రులు తెలిపారు. నీటి సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, ప్రతి పంటకు పంట కుంట, ప్రతి గ్రామానికి ఊట కుంట వంటి పనులను విస్తృతంగా చేపట్టాలని సూచించారు. పంట కుంటల ద్వారా భూగర్భ జలాల పెంపుతో పాటు వ్యవసాయం, చేపల పెంపకానికి కూడా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.
గ్రామాభివృద్ధి ప్రణాళికలు ప్రజల భాగస్వామ్యంతో గ్రామసభల నుంచే రూపొందాలని, ప్రతి పనికి జియో ట్యాగింగ్ చేయాలని అధికారులు సూచించారు. ప్రభుత్వ నిధుల్లో ఒక్క రూపాయి కూడా వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే బహుళ ప్రయోజన పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!