

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఢిల్లీలో భారత్లో అమెరికా రాయబారి సెర్జియో గోర్తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. 30 నిమిషాలకు పైగా సాగిన ఈ సమావేశంలో తెలంగాణలో విద్య, ఉపాధి, పెట్టుబడులు, సాంకేతికత, పరిశోధన రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ముఖ్యమంత్రి కోరారు. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లే తెలంగాణ విద్యార్థులకు వీసా అపాయింట్మెంట్లు పెంచడం, ఇంటర్వ్యూ స్లాట్లను విస్తరించడం, వీసా దరఖాస్తుల పరిశీలనను వేగవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అమెరికాలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన నిపుణుల సమస్యలను కూడా రాయబారి దృష్టికి తీసుకెళ్లిన ముఖ్యమంత్రి, హెచ్-1బీ వీసా ప్రాసెసింగ్, రెన్యువల్, వీసా స్టాంపింగ్ను సరళతరం చేయాలని, వీసా నిబంధనల్లో మార్పులపై ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరారు. తెలంగాణలో ఐటీ, కృత్రిమ మేధ, లైఫ్ సైన్సెస్, ఫార్మా, స్టార్టప్లు, పరిశోధన, ఆధునిక సాంకేతిక రంగాల్లో అమెరికా సంస్థలకు విస్తృత పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని వివరించారు. అమెరికా విశ్వవిద్యాలయాలు తెలంగాణ విద్యాసంస్థలతో కలిసి పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణ–అమెరికా మధ్య వ్యాపారం, పెట్టుబడులు, విద్యా భాగస్వామ్యం, సాంస్కృతిక మార్పిడి, ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు పూర్తి సహకారం అందిస్తామని అమెరికా రాయబారి సెర్జియో గోర్ హామీ ఇచ్చారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!