

భారతదేశానికి 11 వేల కిలోమీటర్లకు పైగా విస్తరించిన తీరప్రాంతం, విశాల ప్రత్యేక ఆర్థిక మండలి (EEZ), వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన ద్వీపాల భద్రత అత్యంత కీలకంగా మారింది. విదేశీ దాడుల నుంచి 26/11 ముంబై ఉగ్రదాడుల వరకు సముద్ర మార్గం దేశ భద్రతపై ఎంతటి ప్రభావం చూపిందో చరిత్ర స్పష్టం చేసింది. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన కార్యకలాపాలను విస్తరిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం నౌకాదళాన్ని మరింత బలోపేతం చేస్తోంది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఐఎన్ఎస్ మహేంద్రగిరి, ఐఎన్ఎస్ దూనాగిరి వంటి అత్యాధునిక యుద్ధనౌకలు నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతున్నాయి.
ప్రస్తుతం భారత నౌకాదళంలో సుమారు 145 యుద్ధనౌకలు, జలాంతర్గాములు సేవలందిస్తుండగా, 2035 నాటికి ఆ సంఖ్యను 200కు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి పూర్తి స్వావలంబన సాధించే దిశగా దేశీయ షిప్యార్డులు ఇప్పటికే 40కుపైగా యుద్ధనౌకలు, సబ్మెరైన్లను నిర్మించాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి ప్రాజెక్టులు భారత రక్షణ రంగ సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటాయి. అయితే హిందూ మహాసముద్రంలో చైనా వేగంగా తన నౌకాదళాన్ని విస్తరిస్తున్న పరిస్థితుల్లో భారత్ కూడా యుద్ధనౌకల నిర్మాణాన్ని వేగవంతం చేసి, నౌకాదళానికి మరింత బలాన్ని అందించాల్సిన అవసరం ఉందని రక్షణ నిపుణులు సూచిస్తున్నారు.


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!