

పార్లమెంటు కార్యకలాపాలకు విపక్షాల నిరసనలతో పదేపదే అంతరాయం కలుగుతుండటంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిష్ఠంభన కారణంగా ప్రతిభావంతులైన పలువురు కొత్త ఎంపీల అభిప్రాయాలను దేశ ప్రజలు వినలేకపోతున్నారని పేర్కొన్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన తెదేపా, జనసేన, ఎన్సీపీఐ, శివసేన, ఆర్పీఐ (అఠవాలే), రాష్ట్రీయ లోక్ మోర్చా, అన్నాడీఎంకే, యూపీపీఎల్కు చెందిన 40 మందికిపైగా ఎంపీలతో మోదీ అల్పాహార సమావేశం నిర్వహించారు. ఇటీవల ఎన్డీయేలో చేరిన ఎంపీలకు భరోసా కల్పిస్తూ.. నియోజకవర్గాల అభివృద్ధిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎన్డీయే ఒక కుటుంబంలా వారికి అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు సమాచారం. యోగా చేయడంతో పాటు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని ఎంపీలకు సూచించారు. ప్రతి ఎంపీతో వ్యక్తిగతంగా మాట్లాడిన మోదీ, వారి సోషల్ మీడియా కార్యకలాపాలపై ప్రత్యేక నివేదికలను కూడా అందించినట్లు తెలుస్తోంది. మహిళా రిజర్వేషన్, నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించిన కీలక బిల్లులను ముందుకు తీసుకెళ్లే సమయంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇటీవల రాజకీయంగా చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో పలువురు ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన 20 మంది లోక్సభ సభ్యులు జూన్లో ఆ పార్టీని వీడి ఎన్సీపీఐలో చేరగా, శివసేన (యూబీటీ) నుంచి బయటకు వచ్చిన ఆరుగురు ఎంపీలు శివసేనలో చేరారు. ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశాలకు రెండుసార్లు గైర్హాజరైన ముస్లిం ఎంపీలు ఖలీవుర్ రహ్మాన్, యూసుఫ్ పఠాన్, అబూ తాహెర్ ఖాన్ కూడా మోదీతో అల్పాహార భేటీలో పాల్గొన్నారు. మరోవైపు శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్బీర్సింగ్ బాదల్ పార్లమెంటు సముదాయంలోని ప్రధాని కార్యాలయంలో మోదీని కలిశారు. వీరి మధ్య చర్చల వివరాలు వెల్లడికాకపోయినా, పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో భాజపా-అకాలీదళ్ మళ్లీ చేతులు కలిపే అవకాశాలపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఏక్నాథ్ శిందే కూడా మోదీతో విడిగా సమావేశమయ్యారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!