

ఆంధ్రప్రదేశ్లో అనుమతించిన పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ముఖ్యమంత్రి ప్రతి నెలా అధికారులతో సమీక్షలు నిర్వహిస్తూ ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన ప్రతి జిల్లాకు ఒక అధికారి, ప్రతి మూడు జిల్లాలకు ఒక ప్రాజెక్టు డైరెక్టర్ను నియమించారు. ప్రాజెక్టులకు అవసరమైన భూముల సేకరణను వేగవంతం చేసేందుకు రిటైర్డ్ రెవెన్యూ, అటవీ శాఖ అధికారుల సేవలను వినియోగించుకుంటున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేసేందుకు 160.50 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పవన, సౌర, పంప్డ్ స్టోరేజీ పవర్ (పీఎస్పీ), బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (బీఈఎస్ఎస్) ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ప్రోత్సాహకాలు ప్రకటించింది.
గత రెండేళ్లలో వివిధ రంగాల్లో సుమారు రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటికి అవసరమైన విద్యుత్ సరఫరా కోసం ఇప్పటికే 49 సంస్థలకు 112.45 గిగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు అనుమతులు ఇచ్చింది. వీటి ద్వారా సుమారు రూ.6.99 లక్షల కోట్ల పెట్టుబడులు, 5.46 లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అంచనా. రోజుకు 10,000 టన్నుల సామర్థ్యంతో కంప్రెస్డ్ బయో గ్యాస్ ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకోగా, 11,457 టీపీడీ సామర్థ్యానికి అనుమతులు ఇచ్చింది. రిలయన్స్ సంస్థ 500 సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుకు రూ.65,456 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. అలాగే 3 గిగావాట్ల ఎలక్ట్రోలైజర్ తయారీ యూనిట్ల ప్రతిపాదనల్లో 2 గిగావాట్ల ప్రాజెక్టులకు రూ.2,000 కోట్ల పెట్టుబడులతో అనుమతులు లభించాయి. ఏటా 1.5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి లక్ష్యంలో భాగంగా 1 ఎంఎంటీపీఏ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!