

ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. ఆదిలాబాద్లో సంయుక్త వినియోగ వైమానిక క్షేత్రాన్ని అభివృద్ధి చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. న్యూఢిల్లీలో నేడు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు సమక్షంలో జరిగిన సమావేశంలో ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ ప్రాజెక్టుతో ఉత్తర తెలంగాణలో పౌర విమానయాన మౌలిక వసతులతో పాటు ప్రాంతీయ అనుసంధానం మరింత మెరుగుపడనుంది.
ప్రాజెక్టును మిషన్ మోడ్లో వేగంగా అమలు చేసేందుకు రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖ, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కో సమన్వయ అధికారిని వచ్చే వారంలోగా నియమించాలని నిర్ణయించారు. అలాగే సమగ్ర ప్రాజెక్టు నివేదిక, మాస్టర్ ప్లాన్ రూపకల్పనను వేగవంతం చేయనున్నారు. ప్రాజెక్టులో భాగంగా 2.75 కిలోమీటర్ల రన్వే నిర్మించనుండగా, భారత వైమానిక దళం వద్ద ఉన్న 369.45 ఎకరాలకు అదనంగా తెలంగాణ ప్రభుత్వం మరో 1,500 ఎకరాల భూమిని సేకరించనుంది. విమానాల పార్కింగ్, హ్యాంగర్లు, శిక్షణ, నిర్వహణ సదుపాయాలతో పాటు పౌర టెర్మినల్, నిర్వహణ-మరమ్మతుల సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!