

నేపాల్లోని నువాకోట్ జిల్లాలో త్రిశూలీ నదికి వచ్చిన భారీ వరదల్లో ఓ ఆకుపచ్చ రంగు ఇల్లు చెక్కుచెదరకుండా నిలబడటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రకాష్కు చెందిన ఈ ఇంటి చుట్టూ ఉన్న భవనాలు, వాహనాలు, ఇతర వస్తువులు వరద ప్రవాహంలో కొట్టుకుపోయినా.. ఈ ఇల్లు మాత్రం సురక్షితంగా నిలిచింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్గా మారాయి. వరద నీరు వేగంగా పెరుగుతున్న విషయం తెలియగానే దుకాణం నుంచి ఇంటికి పరుగెత్తుకుంటూ వచ్చానని ప్రకాష్ తెలిపారు. అప్పటికి ఇంట్లో కుటుంబ సభ్యులు ఐదుగురు ఉన్నారని, వారందరినీ బయటకు రావాలని పిలిచినా.. నీటి ఉధృతికి తమ వాహనం పల్టీ కొట్టడం చూసి తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయామని చెప్పారు. ప్రాణాలు దక్కుతాయో లేదోనని భయపడ్డామని తెలిపారు. నీటి మట్టం పెరగడంతో కుటుంబ సభ్యులంతా తొలుత నాలుగో అంతస్తుకు, ఆ తర్వాత భవనం పైకప్పుపైకి చేరుకున్నారు. అదే సమయంలో పాఠశాలకు వెళ్లిన తన కుమారుడి పరిస్థితిపై తీవ్ర ఆందోళనకు గురైనట్లు ప్రకాష్ చెప్పారు.
ఈ ఇల్లు వరదను తట్టుకుని నిలబడటానికి దాని నిర్మాణ నాణ్యతే ప్రధాన కారణమని ప్రకాష్ వివరించారు. సుమారు 40 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనానికి అప్పట్లో నాణ్యమైన సిమెంట్, నిర్మాణ సామగ్రిని ఉపయోగించామని, నదికి సమీపంలో ఉండటంతో పునాది బలంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని తెలిపారు. పునాది కింద రోడ్డు నిర్మాణంలో ఉపయోగించే మెటీరియల్ను రెండు, మూడు పొరలుగా వేసినట్లు చెప్పారు. అయితే ఇంటి కింది భాగాన్ని దుకాణానికి సంబంధించిన గోదాముగా ఉపయోగించడం వల్ల అక్కడ ఉన్న సరుకులతో పాటు రెండు కార్లు, బైకులు, స్కూటర్లు వరదలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు గంట నుంచి గంటన్నర పాటు ప్రాణభయంతో ఇంట్లో చిక్కుకున్న తర్వాత నీటి మట్టం కాస్త తగ్గింది. అనంతరం సమీపంలోని టోల్ ప్రాంతానికి చెందిన స్థానికులు భవనాల మధ్య పైపును ఏర్పాటు చేసి, తాడు సాయంతో ప్రకాష్ కుటుంబాన్ని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!