

రాష్ట్రంలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమై ఏడాదిన్నర గడిచినా ఇంకా పూర్తికాలేదు. ఇప్పటికీ నమోదు చేసుకోని రైతుల ఇళ్లకే వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) వెళ్లి నమోదు చేస్తున్నారు. యూరియా కొనుగోలు, పంటల విక్రయం, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం ఫార్మర్ ఐడీ తప్పనిసరిగా మారింది. ఏఈవోలు, మీ సేవా కేంద్రాల ద్వారా నమోదు సౌకర్యం కల్పించినప్పటికీ ఇప్పటివరకు కేవలం 71.38 శాతం మంది రైతులు మాత్రమే నమోదు చేసుకున్నారు.
రాష్ట్రంలో ఉన్న 77.56 లక్షల పట్టాదారు పాస్బుక్లలో 55.36 లక్షల మంది మాత్రమే ఫార్మర్ ఐడీ నమోదు పూర్తి చేశారు. వీరిలో 42.26 లక్షల మంది ఏఈవోల ద్వారా, 13.10 లక్షల మంది మీ సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లాలో అత్యధికంగా 88.94 శాతం నమోదు కాగా, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో నమోదు శాతం తక్కువగా ఉంది. పీఎం కిసాన్ వంటి పథకాలు అందకపోవడంతో చాలా మంది రైతులు తర్వాత నమోదు చేసుకుంటున్నారు.
ఆధార్, పట్టాదారు పాస్బుక్ వివరాల్లో తేడాలు, వారసత్వ భూముల నమోదు ఆలస్యం, మొబైల్ నంబర్ లింక్ లేకపోవడం, ఓటీపీ సమస్యలు, సర్వర్ లోపాలు, బయోమెట్రిక్ సమస్యలు వంటి కారణాలతో ప్రక్రియ ఆలస్యమవుతోంది. భవిష్యత్తులో పీఎం కిసాన్, సాయిల్ హెల్త్ కార్డు, ఫసల్ బీమా, అలాగే ఎరువుల కొనుగోలుకు కూడా ఫార్మర్ ఐడీ తప్పనిసరి అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందువల్ల రైతులు వీలైనంత త్వరగా నమోదు పూర్తి చేసుకోవాలని సూచించారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!