

రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ట్రంప్ ప్రతీకార సుంకాలు, సైనిక చర్యలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను మరింత పెంచారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెనెజువెలాపై చర్యలు, ఇరాన్తో ఘర్షణాత్మక వైఖరి ప్రపంచ చమురు సరఫరాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అణ్వాయుధాల నియంత్రణ, అమెరికా భద్రత పేరుతో ఇరాన్పై ఒత్తిడి తెచ్చిన అమెరికా చివరకు కాల్పుల విరమణకు మొగ్గుచూపినా, అనంతరం వచ్చిన ప్రకటనలు శాంతి చర్చలను బలహీనపరిచాయి. హర్మూజ్ జలసంధి ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడి అనేక దేశాలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు గత కొన్ని నెలల్లో దాదాపు 50 శాతం పెరిగినట్లు అంచనా. రవాణా, వ్యవసాయం, పరిశ్రమలపై దీని ప్రభావం తీవ్రంగా పడుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు పొదుపు చర్యలు ప్రారంభించాయి. భారత్లోనూ చమురు దిగుమతుల భారం పెరగడంతో రూపాయి విలువపై ఒత్తిడి పెరుగుతోంది. విదేశీ మారక నిల్వలు కూడా తగ్గుముఖం పట్టినట్లు ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ ఇంధన పొదుపు పాటించాలని, అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత సంక్షోభంలోకి వెళ్లకముందే పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!