

గణేష్ నవరాత్రుల సందర్భంగా వినాయక మాల ధరించి పాఠశాలకు వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన అక్క, తమ్ముడిని టీచర్లు అడ్డుకున్న ఘటన హనుమకొండలో వివాదానికి దారి తీసింది. మాదిరెడ్డికుంటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లు విద్యార్థుల తండ్రి కె. శ్రీకాంత్ తెలిపారు. తన పిల్లలు ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక మాల ధరించి పాఠశాలకు వెళ్లగా, టీచర్లు వారిని అడ్డుకుని మాల విరమణ చేసిన తర్వాతే పాఠశాలకు రావాలని చెప్పారని ఆయన ఆరోపించారు. దీంతో విద్యార్థులు తమ తండ్రికి సమాచారం ఇవ్వడంతో ఆయన పాఠశాలకు వెళ్లి సిబ్బందిని ప్రశ్నించారు.
ఈ విషయం తెలుసుకున్న ఏబీవీపీ, బజరంగ్దళ్, వీహెచ్పీ, హిందూవాహిని నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని యాజమాన్యాన్ని ప్రశ్నించారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే విద్యార్థులు మాలలు ధరించడాన్ని నిషేధించలేదని, కొన్ని అనివార్య కారణాల వల్ల మాలలతో పాఠశాలకు రావడం ఇబ్బందిగా ఉంటుందని మాత్రమే చెప్పామని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో వీహెచ్పీ బాధ్యులు సందీప్ రెడ్డి, సునంద్, హిందూవాహిని బాధ్యులు రాంశర్మ, అశోక్, రాజు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి మార్క సునీల్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!