

ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీ ఫిరాయింపుపై దాఖలైన అనర్హత పిటిషన్లకు సంబంధించి తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న తీర్పు వెలువరించనుంది. స్పీకర్ దానం నాగేందర్పై అనర్హత పిటిషన్లను తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.
ప్రధాన న్యాయమూర్తి అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం ఆగస్టు 21న తీర్పును రిజర్వ్ చేసింది. తొలుత సెప్టెంబర్ 16న తీర్పు ఇవ్వనున్నట్లు ప్రకటించినప్పటికీ, తీర్పు సిద్ధం కాకపోవడంతో సెప్టెంబర్ 18కు వాయిదా వేసింది. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన దానం నాగేందర్ అనంతరం కాంగ్రెస్లో చేరడంతోపాటు సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేయడం అనర్హతకు దారితీస్తుందని పిటిషనర్లు వాదించారు.
ఇదిలా ఉండగా, పోచారం శ్రీనివాసరెడ్డి, యాదయ్య, కడియం శ్రీహరి, బండ్ల కృష్ణమోహన్రెడ్డి, టి. ప్రకాశ్గౌడ్, ఎ. గాంధీ, తెల్లం వెంకట్రావు, సంజయ్ కుమార్ తదితరులపై దాఖలైన అనర్హత పిటిషన్లను స్పీకర్ తిరస్కరించడాన్ని సవాల్ చేసిన కేసుల విచారణను హైకోర్టు అక్టోబర్ 6కు వాయిదా వేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!