

విద్యార్థులు ఇంటి నుంచి విద్యాసంస్థలకు, తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుకునేలా సమగ్ర రవాణా వ్యవస్థను రూపొందించేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న స్టూడెంట్ మొబిలిటీ ప్రోగ్రామ్ (ఎస్ఎంపీ)లో భాగంగా గచ్చిబౌలిలోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీలో క్యాంపస్ కంప్లయెన్స్ వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థలు, ప్రభుత్వ శాఖలను ఒకే డిజిటల్ వేదికపై అనుసంధానించే స్టూడెంట్ పోర్టల్ను ప్రారంభించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా. ఎం. రమేష్ మాట్లాడుతూ విద్యార్థుల భద్రత ప్రతి ఒక్కరి ఉమ్మడి బాధ్యత అని, వారి ప్రయాణం పూర్తిగా సురక్షితంగా ఉండేలా అన్ని భాగస్వామ్య సంస్థలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

520కిపైగా విద్యాసంస్థల్లో నిర్వహించిన సమగ్ర సర్వే, 750కిపైగా విద్యాసంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు, 500కిపైగా విద్యార్థులతో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ ఆధారంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు అధికారులు తెలిపారు. వర్క్షాప్లో సేఫ్ స్టూడెంట్ మొబిలిటీ కారిడార్లు, ట్రాఫిక్ నిర్వహణ, ప్రామాణిక విధానాల (SOPలు) అమలు, పాఠశాలలు, తల్లిదండ్రులు, రవాణా నిర్వాహకులు, పోలీసు, ఆర్టీఏ, విద్యాశాఖ, టీజీఎస్ఆర్టీసీ మధ్య సమన్వయంపై విస్తృతంగా చర్చించారు. స్టూడెంట్ పోర్టల్ ద్వారా సమాచార మార్పిడి, సమస్యల పరిష్కారం, సేవల సమన్వయం, పర్యవేక్షణ మరింత సమర్థవంతంగా సాగుతుందని, దేశానికి ఆదర్శంగా నిలిచే విద్యార్థుల రవాణా వ్యవస్థను సైబరాబాద్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని అధికారులు వెల్లడించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!