

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తూ ప్రజలకు ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై పూర్తి సమాచారం అందించడం పారదర్శక పాలనలో కీలకమని అన్నారు. సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటివరకు ఏడు శ్వేతపత్రాలు విడుదల చేశామని, ఇకపై కూడా ప్రభుత్వ పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్టులను ప్రజలకు అందిస్తామని తెలిపారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం ప్రభుత్వ అభివృద్ధి దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్న ఆయన, ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత "బ్రాండ్ ఆంధ్ర" పునరుద్ధరణకు పలు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు.
సామాజిక సంక్షేమంతో పాటు పారిశ్రామికాభివృద్ధికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, మహిళా సంఘాల కోసం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. పీ4 కార్యక్రమం ద్వారా ప్రస్తుతం 2.4 లక్షల కుటుంబాలకు సాయం అందుతోందని, ఆర్థిక అసమానతలను తగ్గించి పేదరిక నిర్మూలన సాధించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు 28 కొత్త పారిశ్రామిక విధానాలు తీసుకొచ్చి రూ.23 లక్షల కోట్ల విలువైన ఎంవోయూలు కుదుర్చుకున్నామని తెలిపారు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత పాలనను విస్తృతంగా అమలు చేస్తున్నామని, కష్టపడి పనిచేస్తే రాష్ట్రాభివృద్ధి మరింత వేగంగా సాధ్యమవుతుందని చంద్రబాబు అన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!