

తెలంగాణలోని వరంగల్ మామ్నూర్ విమానాశ్రయం అభివృద్ధికి రూ.496.86 కోట్ల (జీఎస్టీతో కలిపి) అంచనా వ్యయంతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రాజ్యసభ సభ్యుడు వేమ్ నరేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. రన్వే, ఆప్రాన్, టాక్సీవే, సరిహద్దు గోడ నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఇప్పటికే విడుదలయ్యాయని, అయితే భూసేకరణ, చట్టబద్ధ అనుమతులు, నిధుల లభ్యత తదితర అంశాలపై పనుల పూర్తి గడువు ఆధారపడి ఉంటుందని కేంద్రం పేర్కొంది.
అదే సమయంలో ఆదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రతిపాదిత విమానాశ్రయాల పురోగతిపైనా కేంద్రం వివరాలు వెల్లడించింది. ఆదిలాబాద్ విమానాశ్రయానికి టెక్నో-ఎకనామిక్ ఫీజిబిలిటీ స్టడీ పూర్తికాగా, పెద్దపల్లి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయానికి ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు. భద్రాద్రి కొత్తగూడెం ప్రతిపాదిత స్థలం భౌగోళిక అడ్డంకుల కారణంగా అనుకూలంగా లేదని తేలింది. అలాగే ఉడాన్ పథకం కింద తెలంగాణలో ఇప్పటికే 58 విమాన మార్గాలు అమల్లో ఉన్నాయని, దేశవ్యాప్తంగా తదుపరి దశలో 120 కొత్త గమ్యస్థానాలను అనుసంధానించనున్నట్లు కేంద్రం పార్లమెంట్కు తెలిపింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!