

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సందేశంలో తెలంగాణ ప్రజల సృజనాత్మకత, వ్యాపార దృక్పథం, ధైర్యసాహసాలను ప్రశంసించారు. గొప్ప చరిత్ర, వైభవోపేతమైన సంస్కృతి కలిగిన తెలంగాణ దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, విజయాలు కలగాలని ఆకాంక్షించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలుగులోనే శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ విశిష్ట సంస్కృతి, పారిశ్రామిక సామర్థ్యంతో దేశ అభివృద్ధిలో కీలక స్థానాన్ని సంపాదించిందని అన్నారు. రాష్ట్రం మరిన్ని అభివృద్ధి శిఖరాలను అధిరోహించి దేశ కీర్తిని మరింత పెంచాలని ఆకాంక్షించారు. జాతీయ నాయకులు ఇద్దరూ తెలుగులో సందేశాలు అందించడం పట్ల తెలంగాణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!