

జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. 3,245 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ పారిశ్రామిక స్మార్ట్ సిటీ ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నిర్వహించిన నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ వీడియో కాన్ఫరెన్స్లో శ్రీధర్బాబు సచివాలయం నుంచి వర్చువల్గా పాల్గొన్నారు.
జహీరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలో భూమి రూపంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం కాగా, అభివృద్ధి పనులకు కేంద్రం నిధులు అందిస్తోంది. నీటి సరఫరా పనుల టెండర్ల ప్రక్రియ పూర్తయిందని, విద్యుత్ సరఫరా పనులను కూడా నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. భవ్య పథకం కింద కేంద్రం ప్రకటించిన 100 ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కుల్లో నాలుగింటిని తెలంగాణకు కేటాయించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను శ్రీధర్బాబు కోరారు. ఈ పార్కులు రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతమిస్తాయని పేర్కొన్నారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!