

భారతదేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ Tata Consultancy Services (టీసీఎస్) తన లేఆఫ్ల దశ ముగిసిందని అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా ఈ నెల 1 నుంచి సాధారణ వార్షిక జీతాల పెంపు చక్రాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. గత ఏడాది ఉద్యోగ కోతలు, జీతాల సవరణల ఆలస్యం వంటి పరిస్థితుల మధ్య ఈ నిర్ణయం సంస్థలో స్థిరత్వం తిరిగి వస్తోందని సూచిస్తోంది.
2025లో సంస్థ సుమారు 2 శాతం ఉద్యోగులను తగ్గించిందని, ఇది వేలాది మంది ఉద్యోగులపై ప్రభావం చూపిందని నివేదికలు తెలిపాయి. కృత్రిమ మేధస్సు వంటి కొత్త సాంకేతిక మార్పులకు అనుగుణంగా సంస్థ పునర్వ్యవస్థీకరణ చేపట్టిందని పేర్కొన్నారు. ఇప్పుడు ఆ దశ పూర్తయిందని టీసీఎస్ స్పష్టం చేస్తూ సాధారణ ప్రాసెస్లను తిరిగి ప్రారంభిస్తోంది. ఇందులో పనితీరు ఆధారంగా జీతాల పెంపు కూడా ఉండనుంది. అత్యుత్తమ పనితీరు చూపిన వారికి రెండంకెల పెంపు లభించగా, సాధారణంగా 4.5% నుంచి 7% వరకు వేతన పెంపు ఉండే అవకాశం ఉంది.
బలమైన ఆర్థిక ఫలితాలతో సంస్థ ఈ స్థిరత్వ దశలోకి ప్రవేశించింది. Q4 లాభం ఏడాది ప్రాతిపదికన 12.2 శాతం పెరిగి ₹13,718 కోట్లకు చేరింది. అలాగే కొత్త ఒప్పందాలు, గ్లోబల్ ఐటీ డిమాండ్ పెరుగుదల కూడా ఈ నిర్ణయానికి మద్దతుగా నిలిచాయి. దీంతో TCS ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నట్లైంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!