

పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించి ప్రజారోగ్యాన్ని మెరుగుపరచడం, అలాగే ప్రభుత్వ ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీతో పాటు అదనంగా ఎక్సైజ్ సుంకం విధిస్తూ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కొత్త పన్ను విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ మార్పులు 2026 ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానున్నాయి. జీఎస్టీ అమలయ్యాక గత ఏడేళ్లుగా పొగాకు ఉత్పత్తులపై పన్నుల్లో మార్పులు లేకపోవడంతో ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
కొత్త విధానంలో పాన్మసాలా, గుట్కా, నమిలే పొగాకు, జర్దా వంటి ఉత్పత్తులపై ఆరోగ్య, జాతీయ భద్రత సెస్సులతో పాటు అధిక ఎక్సైజ్ సుంకం విధిస్తారు. గరిష్ఠంగా జీఎస్టీ 40 శాతానికి పెరగనుంది. సిగరెట్లపై పొడవు, ఫిల్టర్ ఆధారంగా వెయ్యి స్టిక్స్కు రూ.2,050 నుంచి రూ.8,500 వరకు అదనపు పన్ను విధించనున్నారు. అలాగే ప్యాకేజీపై ముద్రించిన ఎమ్ఆర్పీ ఆధారంగా కొత్త విలువ లెక్కింపు విధానాన్ని అమలు చేయనున్నారు.
ఎక్సైజ్ సుంకం ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆర్థిక కమిషన్ సిఫారసుల మేరకు రాష్ట్రాలకు పంపిణీ చేయనున్నారు. పాన్మసాలా తయారీ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యంపైనా ఆరోగ్య సెస్సు విధించనున్నారు. నమిలే పొగాకు, గుట్కా తయారీ యూనిట్లలో ఫిబ్రవరి 1 నుంచి సీసీటీవీలు తప్పనిసరి చేయనున్నారు.
ఇదిలా ఉండగా, పొగాకు ఉత్పత్తులపై పన్నులు భారీగా పెరిగితే ధరలు పెరిగి అక్రమ రవాణా (స్మగ్లింగ్) పెరిగే ప్రమాదం ఉందని పొగాకు పరిశ్రమ సంఘం టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. పన్నుల పెంపును దశలవారీగా అమలు చేయాలని, ఈ నిర్ణయం రైతులు, చిన్న వ్యాపారాలు మరియు దేశీయ పరిశ్రమపై ప్రభావం చూపుతుందని కేంద్రాన్ని సమీక్షించాల్సిందిగా కోరింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!