

తిరువనంతపురం: మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచి 2025 సంవత్సరాన్ని చిరస్మరణీయం చేసుకున్న భారత మహిళల జట్టు.. ఈ ఏడాదిని కూడా ఘనంగా ముగించింది. శ్రీలంకతో జరిగిన ఐదు టీ20 ల సిరీస్ను భారత్ 5-0 తో క్లీన్ స్వీప్ చేస్తూ ప్రత్యర్థులకు పూర్తిస్థాయిలో ఆధిపత్యం చూపించింది. మంగళవారం జరిగిన చివరి టీ20 లో హర్మన్ప్రీత్ కౌర్ సేన 15 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక జట్టు 20 ఓవర్లలో 160/7 పరుగులకే పరిమితమైంది. ఓపెనర్ హాసిని పెరీరా (65) మరియు వన్డౌన్ బ్యాటర్ ఇమేషా దులానీ (50) అర్ధ శతకాలతో పోరాడినా.. మిగతా బ్యాటర్లు నిలకడగా ఆడలేకపోయారు. భారత బౌలర్లలో దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, వైష్ణవి శర్మ, అమన్జ్యోత్ కౌర్, శ్రీచరణి, స్నేహ్ రాణా తలో వికెట్ తీసి విజయానికి కీలకంగా నిలిచారు.
భారత బ్యాటింగ్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (68) అద్భుతమైన ఇన్నింగ్స్తో జట్టును ఆదుకుంది. చివర్లో అరుంధతి రెడ్డి (27) వేగంగా పరుగులు రాబట్టి స్కోరును మరింత పెంచింది. అమన్జ్యోత్ (21) ఫర్వాలేదనిపించగా, జి.కమలిని, షెఫాలి వర్మ, రిచా ఘోష్, దీప్తి శర్మ నిరాశపరిచారు. ఒక దశలో భారత్ 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయినప్పటికీ, హర్మన్ప్రీత్ - అమన్జ్యోత్ జంట ఆరో వికెట్కు 61 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి స్కోరును నిలబెట్టింది. శ్రీలంక బౌలర్లలో చమరి ఆటపట్టు, రష్మిక, కవిషా దిల్హరి రెండేసి వికెట్లు పడగొట్టగా.. నిమాషా మదుశని ఒక వికెట్ సాధించింది. ఈ మ్యాచ్లో ఒక వికెట్ తీసిన దీప్తి శర్మ మహిళల టీ20 ల్లో కొత్త రికార్డు సృష్టించింది. ఆస్ట్రేలియా బౌలర్ మేగాన్ షట్ (151 వికెట్లు) రికార్డును అధిగమించి, అత్యధిక వికెట్లు తీసిన మహిళా బౌలర్గా దీప్తి చరిత్ర సృష్టించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!