

విశాఖపట్నం ఎంపీ శ్రీభరత్ వైసీపీ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డంకులు సృష్టించే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం మౌనం వహించదని హెచ్చరించారు. సోమవారం విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న శ్రీభరత్, మీడియాతో మాట్లాడుతూ - “ప్రజలు ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పారు, అయినా వారిలో మార్పు కనిపించడం లేదు. అభివృద్ధి అంటే వైసీపీకి అర్థం కాదు. రాష్ట్రాన్ని నాశనం చేయడంలో మాత్రం పీహెచ్డీ చేశారు” అని తీవ్రంగా విమర్శించారు.
ప్రపంచ స్థాయి పెట్టుబడుల సదస్సు జరుగుతున్న సమయంలో వైసీపీ నేతలు ర్యాలీల పేరుతో రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. “ఏపీకి మంచి జరగాలంటే, ప్రజల భవిష్యత్తు మెరుగుపడాలంటే, మనందరం కలిసి పనిచేయాలి. కానీ, వైసీపీ మాత్రం అభివృద్ధిని అడ్డుకోవడమే తమ ధ్యేయంగా చేసుకుంది” అని విమర్శించారు. విశాఖ సమ్మిట్ గురించి మాట్లాడుతూ, 410 కి పైగా ఒప్పందాలు, మొత్తం ₹9.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోకి రానున్నాయని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల ప్రోత్సాహానికి ప్రాధాన్యతనిస్తూ, త్వరలోనే కొత్త పరిశ్రమల శంకుస్థాపనలు జరగనున్నాయని తెలిపారు.
వైసీపీ నేతలు చేసిన అక్రమాలు, అసభ్య వ్యాఖ్యలు, హింసాత్మక చర్యలకు ప్రభుత్వం కఠినంగా స్పందిస్తుందని హెచ్చరించారు. “చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుంది — తప్పు చేసిన వారు ఎవరో ప్రజలకు కూడా తెలుసు,” అని ఆయన గట్టిగా అన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!