

తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం చుట్టూ మరోసారి సంచలనం రేగింది. గత సంవత్సరం జూలై–ఆగస్టు నెలల్లో ఈ లడ్డూలలో జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అప్పట్లో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవడంతో కేసు సీబీఐకి బదిలీ అయింది. ప్రస్తుతం ఆ దర్యాప్తు కొనసాగుతోంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ను ఏర్పాటు చేసింది. తాజాగా ఆ బృందం సమర్పించిన రిమాండ్ రిపోర్టులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. వైసీపీ నేత, ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న సమయంలో ఆయనకు సన్నిహితుడైన ‘చిన్న వెంకన్న’ పేరుతో గుర్తించిన వ్యక్తి టీటీడీ నెయ్యి సరఫరా వ్యవహారంలో కీలక పాత్ర పోషించాడని SIT నివేదిక చెబుతోంది.
భోలే బాబా అనే సంస్థ తిరుమల దేవస్థానానికి నెయ్యి సరఫరా కోసం కాంట్రాక్టు కోసం ప్రయత్నించగా, చిన్న వెంకన్న ప్రతి కిలో నెయ్యిపై రూ.25 కమీషన్ కోరినట్లు విచారణలో బయటపడింది. ఆ సంస్థ కమీషన్ ఇవ్వడానికి నిరాకరించడంతో, చిన్న వెంకన్న అధికారులపై ఒత్తిడి తెచ్చి ఆ సంస్థను తప్పించేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీని తర్వాత ‘ప్రీమియర్ అగ్రిఫుడ్స్’ అనే మరో సంస్థను ఎంపిక చేసేలా ఆయన ప్రభావం చూపినట్లు రిమాండ్ రిపోర్టు చెబుతోంది. ఈ సంస్థ అధిక ధరలు కోట్ చేసి, కమీషన్ ఇవ్వడానికి అంగీకరించిందని అధికారులు పేర్కొన్నారు.
మొత్తంగా, పవిత్ర లడ్డూ నెయ్యి సరఫరాలో చోటుచేసుకున్న ఈ అవకతవకలు తిరుమల దేవస్థానం ప్రతిష్టను దెబ్బతీశాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










కామెంట్స్ (2)
Really sad to hear this 😔
Unexpected from TTD