

నోబెల్ శాంతి బహుమతి అందుకోవాలన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆకాంక్షకు అనూహ్యమైన మలుపు ఏర్పడింది. నోబెల్ కమిటీ నుంచి కాకపోయినా, వెనుజువెలా ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడో చేతుల మీదుగా ఆయనకు ఒక ప్రత్యేక గౌరవం దక్కింది. గురువారం వైట్ హౌస్లో ట్రంప్ను మచాడో కలిశారు. ఈ భేటీ సందర్భంగా, తనకు లభించిన నోబెల్ శాంతి బహుమతి గుర్తుగా ఉన్న పతకాన్ని ట్రంప్కు ఆమె అందజేశారు. ఈ విషయాన్ని సమావేశం అనంతరం మచాడో స్వయంగా మీడియాకు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
సుమారు రెండువందల ఏళ్ల తర్వాత, బొలివర్ వారసులు వాషింగ్టన్ వారసుడికి ఒక గౌరవాన్ని తిరిగి ఇస్తున్నారు. స్వేచ్ఛ కోసం ట్రంప్ చూపిన నిబద్ధతకు గుర్తుగా నా నోబెల్ శాంతి బహుమతిని ఆయనకు అందజేస్తున్నాను అని పేర్కొన్నారు.
వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్యను ఇటీవల అమెరికా సైనిక దళాలు అదుపులోకి తీసుకున్న ఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ భేటీ జరగడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మచాడోతో సమావేశం అనంతరం ట్రంప్ స్పందిస్తూ,
మారియా కొరినా మచాడోను కలవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఆమె ఎన్నో సవాళ్లను ఎదుర్కొని నిలిచిన ధైర్యవంతురాలు. ప్రపంచ శాంతి కోసం నేను చేసిన కృషిని గుర్తించి ఆమె తన నోబెల్ బహుమతిని నాకు బహుమతిగా ఇచ్చారు. థ్యాంక్యూ మారియా అంటూ తన ట్రూత్ సోషల్ వేదికలో పేర్కొన్నారు.
గత ఏడాది నోబెల్ శాంతి బహుమతికి తాను పూర్తిగా అర్హుడినని ట్రంప్ బహిరంగంగా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఆయనకు ఆ పురస్కారం దక్కలేదు.
అయితే 2025 సంవత్సరానికి నోబెల్ శాంతి బహుమతి మారియా కొరినా మచాడోకే లభించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!