

తమిళ స్టార్ విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' విడుదలకు సిద్ధమవుతుండటంతో తమిళ సినీ పరిశ్రమలో విడుదల తేదీల సమీకరణం పూర్తిగా మారిపోయింది. మొదట సంక్రాంతి బరిలోకి రావాల్సిన ఈ చిత్రం సెన్సార్ ప్రక్రియ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. తాజాగా అన్ని అనుమతులు పూర్తవడంతో జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. రాజకీయాల్లోకి అడుగుపెట్టే ముందు విజయ్ నటిస్తున్న చివరి సినిమా కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో అదే సమయంలో విడుదలకు సిద్ధమైన పలు చిత్రాల నిర్మాతలు తమ సినిమాలను వాయిదా వేసుకుంటూ పోటీని నివారించే ప్రయత్నం చేస్తున్నారు. విజయ్కు ఘనమైన వీడ్కోలు పలకాలని తమిళ సినీ పరిశ్రమ భావిస్తున్నట్లు ఈ పరిణామాలు సూచిస్తున్నాయి.
జీవీ ప్రకాష్ హీరోగా నటించిన 'ఇమ్మోర్టల్' చిత్రాన్ని మొదట జులై 23న విడుదల చేయాలని ప్రకటించినా, తర్వాత సెప్టెంబర్ 4కు మార్చేశారు. కీర్తి సురేష్ నటించిన 'సత్యవాన్ సావిత్రి' ప్రమోషన్లు కూడా ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విడుదల తేదీపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన 'డీసీ' కూడా జులై 31 నుంచి ఆగస్టు 7కు వాయిదా పడింది. ఈ చిత్రానికి 'ఏ' సర్టిఫికేట్ వచ్చినప్పటికీ, విడుదలను వారం రోజుల పాటు వెనక్కి జరిపారు. అలాగే సంజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సిగ్మా' ప్రమోషన్లు కూడా నెమ్మదించడంతో విడుదలపై స్పష్టత రాలేదు. మొత్తం మీద 'జన నాయగన్' విడుదల నేపథ్యంలో తమిళ చిత్రసీమలో బాక్సాఫీస్ పోటీకి దూరంగా ఉండే వ్యూహం స్పష్టంగా కనిపిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!