

తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) త్వరలోనే స్టార్ట్ చేస్తామని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గ్యానేష్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రక్రియ దేశానికి మార్గదర్శకంగా నిలుస్తుందని. బీహార్లో విజయవంతంగా పూర్తయిన SIR ప్రక్రియను ప్రమాణంగా తీసుకోవాలని ఆయన సూచించారు.
ఆదివారం రవీంద్ర భారతి లో గ్యానేష్ కుమార్ బూత్ స్థాయి అధికారులతో (బీఎల్ఓలు) సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “భారత ఎన్నికల వ్యవస్థకు బీఎల్ఓలే వెన్నెముక. వారి నిబద్ధత, కృషిపైనే ఓటర్ల జాబితా శుద్ధి విజయం ఆధారపడి ఉంటుంది”, అని పేర్కొన్నారు. బీహార్లో జరిగిన SIR ప్రక్రియలో ఏ విధమైన లోపాలు లేకుండా 7.5 కోట్ల మంది ఓటర్లు తమ హక్కును వినియోగించారని, ఫిర్యాదులు లేకుండా ఎన్నికలు విజయవంతమైందని గ్యానేశ్ కుమార్ వివరించారు. తెలంగాణ విస్తీర్ణం కెనడా కన్నా పెద్దదని, సమగ్ర ఓటర్ల జాబితా శుద్ధి పూర్తయిన తర్వాత రాష్ట్రంలో ఎన్నికల పరిపాలన ఒక కొత్త యుగంలోకి అడుగుపెడుతుందని ఆయన చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో తక్కువ పోలింగ్ శాతం పట్టణ ఓటర్ల నిరాసక్తి కారణమని, గ్రామీణ ప్రాంతాల్లో ఉత్సాహంగా ఓటర్లు క్యూల్లో నిలబడి హక్కును వినియోగిస్తున్నారని తెలిపారు. భారత ఎన్నికలు దేశ చట్టాల ప్రకారం నిర్వహించబడుతున్నాయని, ప్రతి ఒక్కరు వాటిని పాటించాల్సినదని ఆయన స్పష్టంగా చెప్పారు.
అంతేకాక, 1995 లో సభ్యదేశంగా చేరిన ఇంటర్నేషనల్ ఐడియాలో దాదాపు 30 ఏళ్ల తర్వాత భారత్కు ఛైర్మన్షిప్ లభించడం, భారత ఎన్నికల సంఘం ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ మరియు వినూత్న ఎన్నికల నిర్వహణ సంస్థగా గుర్తింపు పొందిందని గ్యానేశ్ కుమార్ తెలిపారు. దేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి 90 కోట్లకు పైగా ఓటర్లు ఉన్నారని ఆయన వివరించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!