

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర ప్రకటనపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. జగన్ పాదయాత్ర ఇప్పుడు ఎందుకు అవసరమైందని ప్రశ్నించిన ఆమె, అధికారం కోసమే ఈ యాత్ర కదా అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అధికారం ఇచ్చినప్పుడు జగన్ ప్రజల కోసం ఏం చేశారని నిలదీశారు. వైఎస్సార్ జలయజ్ఞం పేరుతో ప్రారంభించిన ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదని, ఎన్నికల హామీలను గెలిచిన తర్వాత ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన షర్మిల, మద్యం మాఫీ అన్న వ్యక్తే మద్యాన్ని ఏరులై పారించి నకిలీ మద్యంతో కోట్ల రూపాయలు సంపాదించారని తీవ్ర విమర్శలు చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుషికొండ పరిస్థితి ఏమైందో ప్రజలంతా చూశారని ఆమె అన్నారు. సీఎంగా ఉన్నప్పుడు జగన్ ప్రజల్లోకి ఎప్పుడు వచ్చారని, కనీసం పార్టీ నాయకులకు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు సభలతో హడావుడి చేసిన జగన్, మళ్లీ అధికారంలోకి వస్తే ఏం చేయాలని అనుకుంటున్నారని షర్మిల విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ పని తీరు అందరికీ తెలిసిందని, జగన్కు అధికారం సూట్ కాలేదని వ్యాఖ్యానించారు. జగన్లో స్వార్థం తగ్గి ప్రజలకు సేవ చేసే మనస్తత్వం రావాలని, అప్పటి వరకు ప్రజలు కూడా ఆదరించరని ఆమె స్పష్టం చేశారు. ఉపాధి హామీ కూలీల కోసం, మండ్రేగా కోసం జగన్ ఎందుకు పాదయాత్ర చేయడం లేదని ప్రశ్నిస్తూ, ఆయన పాదయాత్ర ఎవరి కోసం, ఏ ప్రయోజనం కోసం అనేది ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!