

అటవీ భూములను తాము అక్రమంగా ఆక్రమించారని పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలు పూర్తిగా తప్పుడు ఆరోపణలేనని వైసీపీ నాయకుడు, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల పవన్ కళ్యాణ్ పెద్దిరెడ్డి కుటుంబం 104 ఎకరాల అటవీ భూములను ఆక్రమించిందని, అవి వారసత్వంగా ఎలా మారాయో పరిశీలించాలని అధికారులకు ఆదేశించారు. అటవీ భూములకు వారసత్వం ఎలా ఉంటుందనే ప్రశ్నను కూడా పవన్ లేవనెత్తారు.
ఈ పరిణామాలపై స్పందించిన మిథున్ రెడ్డి, తాము ఎలాంటి అటవీ భూములనూ ఆక్రమించలేదని అన్నారు. ఆ భూములను ఉమ్మడి రాష్ట్రంలో, అప్పటి చంద్రబాబు ప్రభుత్వ కాలంలోనే చట్టబద్ధంగా కొనుగోలు చేశామని వెల్లడించారు. ఆస్తులకు సంబంధించిన అన్ని హక్కులు తమకు ఉన్నాయని, కావాలంటే ఆన్లైన్లో సర్వే నంబర్ల ద్వారా ఎవరైనా పరిశీలించవచ్చని చెప్పారు. ఆస్తులపై పూర్తి పత్రాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.
తమ కుటుంబం భూములను ఆక్రమించుకుందని నిరూపించగలరా అని పవన్ కళ్యాణ్ను మిథున్ రెడ్డి సవాల్ చేశారు. ఆక్రమణ కాదు, కొనుగోలు చేశామని తాము నిరూపిస్తామని, ఆ సమయంలో పవన్ క్షమాపణ చెప్పాల్సి వస్తుందని అన్నారు. తమ కుటుంబాన్ని అనవసరంగా అభాసుపాలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, గతంలో కూడా ఎర్రచందనం కేసుపై ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, అప్పుడు కూడా తాము నిజాయితీని నిరూపించుకున్నామని గుర్తు చేశారు.
రాజకీయంగా ఎదిరించలేక అటవీ భూములు ఆక్రమించారని, ఎర్రచందనం దొంగతనం చేశారని ఆరోపణలు చేయడం సరైందికాదని మిథున్ రెడ్డి అన్నారు. ఏ విషయంలోనైనా పారదర్శకత తమ కుటుంబ ప్రత్యేకత అని, తమ వ్యాపారాలు పూర్తిగా నైతికంగా నడుస్తున్నాయని చెప్పారు. తమ వ్యాపారాల ద్వారా వేలాది మందికి ఉపాధి లభిస్తున్నదని ఆయన తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!