

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కౌలు రైతులకు న్యాయం చేయాలనే స్పష్టమైన సందేశం ఇచ్చారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని తీరప్రాంతాల పర్యవేక్షణ అనంతరం ఆయన మాట్లాడుతూ, కాలువల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా నాగాయలంక, కోడూరు మండలాల్లో సుమారు 5 వేల ఎకరాలు ముంపుకు గురయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. అవుట్ఫాల్ స్లూయిజ్ల పునరుద్ధరణకు ప్రస్తుతం రూ.50 కోట్ల ఖర్చు అవుతుందని, ఇది గత పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. మంగళగిరిలో జరిగిన సమీక్షా సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, “ఎటిమొగ – ఎదురుమొండి దీవుల్లో నివసించే ప్రజల కలను నిజం చేయబోతున్నాం. హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఇప్పటికే నాబార్డ్ నుంచి రూ.109 కోట్లు మంజూరయ్యాయి. నిర్ణీత కాలంలో పనులు పూర్తవుతాయి” అని తెలిపారు.
మొంథా తుఫాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న ప్రాంతాలను ఇటీవల సందర్శించిన పవన్ కల్యాణ్, “నష్టపోయిన వారిలో కౌలు రైతులు కూడా ఉన్నారు. వారికి కూడా సమాన న్యాయం జరగాలి” అని అన్నారు. కృష్ణా జిల్లాలో 60 వేల మందికి పైగా కౌలు రైతులు సీసీసీఆర్ కార్డులు కలిగి ఉన్నారని, నమోదు కాని రైతులు కూడా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ప్రతీ రైతుని గుర్తించి వారికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. హంసలదీవి పవిత్ర సంగమ ప్రాంతంలో భక్తుల నుంచి అటవీశాఖ వసూలు చేస్తున్న రుసుముపై కూడా ఆయన స్పందిస్తూ, “ఇది ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసానికి సంబంధించిన విషయం. రుసుము తక్కువైనా భక్తుల భావాలను గౌరవించేలా ప్రత్యామ్నాయాలు పరిశీలించాలి” అని సూచించారు.










కామెంట్స్ (2)
Nice to see Pawan Kalyan standing by the farmers!
Political PK Commitment