

వైట్ హౌస్ కి కొన్ని బ్లాక్ల దూరంలో బుధవారం జరిగిన కాల్పుల్లో ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. విచారణ అధికారుల సమాచారం ప్రకారం ఇది స్పష్టంగా లక్ష్యంగా చేసిన దాడిగా కనిపిస్తోంది. కాల్పుల తరువాత నిందితుడ్ని గాయాలతో అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వైట్ హౌస్ ప్రాంతంలో లాక్డౌన్ అమలు చేసి, ఫెడరల్ మరియు నగర పోలీస్ దళాలు పెద్ద సంఖ్యలో చేరాయి.
మధ్యాహ్నం 2.15 సమయంలో 17వ మరియు I స్ట్రీట్స్ వద్ద నేషనల్ గార్డ్ సభ్యులు పర్యటిస్తుండగా, ఒక వ్యక్తి ఆకస్మాత్తుగా వచ్చి కాల్పులు జరిపాడు. సైనికులు ప్రతిగా కాల్పులు చేయగా, ఇతర గార్డ్ సభ్యులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నట్లు మెట్రోపాలిటన్ పోలీస్ అసిస్టెంట్ చీఫ్ జెఫ్ క్యారల్ తెలిపారు.
FBI డైరెక్టర్ కాశ్ పటేల్ తెలిపిన దాని ప్రకారం ఇద్దరు గాయపడిన సైనికుల పరిస్థితి తీవ్రమే. ఇది లక్ష్యంగా చేసిన దాడి అని వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్ స్పష్టం చేశారు.
వెస్ట్ వర్జీనియా గవర్నర్ ప్యాట్రిక్ మోరిసీ మొదట సోషల్ మీడియాలో ఇద్దరు సైనికులు మరణించారని పేర్కొన్నా, తరువాత వచ్చిన విభిన్న సమాచారం కారణంగా ఆ వ్యాఖ్యను సరిదిద్దారు.
నిందితుడు ఒంటరిగా వ్యవహరించినట్లు అధికారులు భావిస్తున్నారు. దాడిదారుడు మరియు గాయపడిన సైనికుల వివరాలు ఇంకా బయటపెట్టలేదు.
కాల్పుల సమయంలో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా లో ఉండగా, ఉపాధ్యక్షుడు JD వాన్స్ కెంటకి రాష్ట్రంలో ఉన్నారు. తర్వాత ట్రంప్ సోషల్ మీడియాలో నిందితుడి పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ, నేషనల్ గార్డ్ చర్యలను ప్రశంసించారు.
ఫారగట్ స్క్వేర్ వద్ద ఉన్న ప్రత్యక్ష సాక్షులు కాల్పుల తరువాత ప్రజలు పరుగులు తీయడం, కొందరు సైనికులకు ప్రాణ రక్షక చర్యలు చేస్తుండటం చూశారు. మరికొందరు గార్డ్ సభ్యులు నిందితుడ్ని నేల పై పడేసి అదుపులోకి తీసుకోవడాన్ని గమనించారు.
ఇమ్మిగ్రేషన్ మరియు నేర నియంత్రణ చర్యల భాగంగా ఆగస్టు నుంచి వాషింగ్టన్ లో నేషనల్ గార్డ్ దళాలు మోహరించబడ్డాయి. ప్రస్తుతం సుమారు 2,200 మంది గార్డ్ సభ్యులు ఉన్నారు. ఈ ఘటన తరువాత అదనంగా 500 మంది గార్డ్ దళాలను పంపాలని అధ్యక్షుడు ట్రంప్ ఆదేశించారని రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!