

పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగిన మెగా పేరెంట్–టీచర్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్, పీటీఎం అంటే చిన్నప్పుడు తనకు భయమేసేదని నవ్వుతూ చెప్పారు. తాను అల్లరి బ్యాచ్లో ఉండేవాడనీ, క్లాస్ టీచర్ తరచూ తన పై తల్లికి ఫిర్యాదు చేసేదని గుర్తుచేశారు. నా చిన్నప్పుడు నా పేరెంట్ టీచర్ మీటింగ్కి ముఖ్యమంత్రి రావడం అనేది అసాధ్యమైంది. కానీ మీ మీటింగ్కి ఆయనే స్వయంగా వచ్చారు అని లోకేష్ వ్యాఖ్యానించారు. ఎంత పని ఒత్తిడి ఉన్నా, తన కుమారుడు దేవాన్ష్ మీటింగ్కి మాత్రం తప్పకుండా వెళ్తానని కూడా అన్నారు.
విద్యలో విలువలు పెంపొందించేందుకు చాగంటి కోటేశ్వరరావుతో ప్రవచనాలు నిర్వహించిన విషయాన్ని గుర్తుచేసిన లోకేష్, తల్లికి చెప్పలేని పని ఎప్పుడూ చేయొద్దని చాగంటి గారు బలంగా చెప్పారు. ఈ సందేశం ప్రతి పిల్లవాడికి అవసరం అని వివరించారు. పిల్లల కోసం ప్రత్యేకంగా బాలల రాజ్యాంగం రూపొందించిన విషయాన్ని ఆయన చెప్పారు. పిల్లలతో మాక్ అసెంబ్లీ నిర్వహించగా, వారు సమస్యల పై అత్యద్భుతంగా చర్చించారని, కొన్నిసార్లు ఎమ్మెల్యేల కంటే కూడా మెరుగ్గా స్పందించారని తెలిపారు. మహిళలను అవమానించే విధంగా వాడే కొన్ని పదాలను పూర్తిగా తగ్గించాల్సిన అవసరం ఉందని, ఇటువంటి భాషకు సమాజంలో స్థానం ఉండకూడదని లోకేష్ స్పష్టం చేశారు. గతంలో పాఠ్యపుస్తకాలలో ఇంటి పనులు మహిళలకే పరిమితమైనట్లు చూపించిన ఫొటోలు ఉండేవని, ఇప్పుడు మహిళలతో పాటు మగవారూ ఇంటి పనుల్లో భాగస్వాములవుతున్నట్లు చూపించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.
ఫిన్లాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల విద్యా విధానాలను అధ్యయనం చేసేందుకు టీచర్లు, విద్యార్థులను పంపాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయాన్ని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో రెండేళ్లలో ఉత్తమ విద్యా విధానాన్ని అమలు చేయాలని సీఎం ఇచ్చిన ఆదేశాలను నెరవేర్చడానికి ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. డిప్యూటీ ముఖ్యమంత్రి ఎప్పుడూ నా వెనుకుండి సలహాలు ఇస్తున్నారు. విద్యా రంగంలో తీసుకురాబోయే మార్పులు, సంస్కరణలు, పిల్లలకు అందించే భోజనం వంటి అంశాల పై ప్రతిరోజూ చర్చలు జరుగుతున్నాయి అని లోకేష్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను ఎలాంటి చిన్నచూపు చూడకూడదని, వాటిలోనే మట్టిలోని మాణిక్యాలు ఉన్నాయని, పిల్లలను ధైర్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని లోకేష్ పిలుపునిచ్చారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!