

మహిళల వన్డే ప్రపంచకప్ లో అద్భుతమైన ఆటతీరుతో జట్టుకు కీలక విజయాలు అందించిన రాష్ట్రానికి చెందిన మహిళా క్రికెటర్ శ్రీ చరణికి కూటమి ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఉండవల్లి నివాసంలో శ్రీ చరణిని కలిసిన విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ స్వయంగా ఆమెకు రూ.2.5 కోట్ల నగదు చెక్ ని అందజేశారు. అంతర్జాతీయ క్రికెట్ లో నిలకడైన ప్రదర్శనతో దేశానికి, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిన ఆమె ప్రతిభను ప్రభుత్వం ఈ విధంగా గౌరవించింది.
కడప జిల్లాకు చెందిన శ్రీ చరణి, ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో కీలక మ్యాచ్లలో మెరుగైన ప్రదర్శన చేసి జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించారు. ఆమె కృషిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహంతో పాటు మరిన్ని భరోసాలను ప్రకటించింది. రూ.2.5 కోట్ల నగదు బహుమతితో పాటు, విశాఖపట్నంలో 500 గజాల విస్తీర్ణంలో ఇంటి స్థలం కేటాయించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా, ఆమె డిగ్రీ పూర్తి చేసిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వంలో గ్రూప్–1 స్థాయి ఉద్యోగం కల్పించనున్నట్లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ కార్యక్రమంలో రవాణా, యువజన మరియు క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, శాప్ ఎండీ భరణి తదితరులు పాల్గొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!