

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ పేదింటి ఆడబిడ్డలకు అందుతున్న ఆర్థిక భరోసాను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కల్యాణ లక్ష్మి అంశంలో ప్రభుత్వం హైకోర్టులో సరైన కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించిన కేటీఆర్.. పేదల సంక్షేమ పథకాన్ని కాపాడేందుకు బీఆర్ఎస్ పోరాడుతుందని అన్నారు. కాంగ్రెస్ తీరును నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వం 2014లో ప్రారంభించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా ఇప్పటివరకు సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందించినట్లు కేటీఆర్ తెలిపారు. గతంలో రూ.51 వేలతో ప్రారంభమైన సాయాన్ని దశలవారీగా రూ.1,00,116కు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయకుండా రద్దు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పెండింగ్లో ఉన్న అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సాయం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!