

తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ అవినీతి, తప్పు నిర్ణయాల వల్లే రాష్ట్ర నీటిపారుదల శాఖకు తీవ్ర నష్టం జరిగిందని ఆయన ఆరోపించారు. ఉద్యమాలు చేయడం కంటే ముందు గతంలో చేసిన తప్పులకు ప్రజలకు సమాధానం చెప్పాలని, క్షమాపణ కోరాలని స్పష్టం చేశారు.
కృష్ణా జలాల విషయంలో బచావత్ ట్రైబ్యునల్ కేటాయింపులపై కేసీఆర్ అపెక్స్ కౌన్సిల్లో ఒప్పందం చేసుకున్నారా లేదా చెప్పాలని ఉత్తమ్ ప్రశ్నించారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందన్న వాదనను ఖండిస్తూ, అంచనాలు పెంచి పనులు పూర్తి చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే డీపీఆర్ను కేంద్రం వెనక్కి పంపిందని గుర్తుచేశారు. తెలంగాణకు 299 టీఎంసీలు సరిపోతాయని రాసిచ్చారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం 500 టీఎంసీలకు మించి నీరు రావాలనే ట్రైబ్యునల్లో పోరాడుతోందని చెప్పారు.
కేసీఆర్ ఏపీతో కుమ్మక్కై రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పరోక్ష సహాయం చేశారని, కృష్ణా జలాల తరలింపులో తెలంగాణకు ద్రోహం జరిగిందని ఉత్తమ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు భారీగా ఖర్చు చేసినా కొత్త ఆయకట్టు శూన్యమని విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి కాలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, మీడియాతో మాట్లాడే ముందు సన్నద్ధంగా రావాలని కేసీఆర్కు హితవు పలికారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే రాష్ట్రంలో వరి సాగు అత్యధికంగా పెరిగిందని తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!