

వైసీపీ హయాంలో వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యల కేసులో పవన్ కళ్యాణ్పై గుంటూరు కోర్టులో దాఖలైన క్రిమినల్ ఫిర్యాదుపై హైకోర్టు ఆక్షేపణ వ్యక్తం చేసింది. ఆ సమయంలో ఆయన ఎంపీ గానీ, ఎమ్మెల్యే గానీ కాదని గుర్తుచేస్తూ, ఏ అధికారం మీద పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫిర్యాదు దాఖలు చేశారో ప్రశ్నించింది. ప్రభుత్వం ఇచ్చిన జీఓ కూడా చట్టపరంగా సరైన ఆధారాలు లేకుండా జారీ చేసినట్లుగా ఉందని వ్యాఖ్యానించింది. పోలీసుల తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించగా, పిటిషనర్ల ప్రతివాదనల కోసం విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది.
2023 జూలై 9న జరిగిన వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల ఆధారంగా వైసీపీ ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ఐపీసీ 499, 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అయితే తర్వాత కొందరు వాలంటీర్లు తమ ప్రతిష్ఠ దెబ్బతినలేదని, తమ సంతకాలు ఒత్తిడితో తీసుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు ఉపసంహరణకు పీపీ కోర్టును ఆశ్రయించగా, గుంటూరు కోర్టు అనుమతిచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారు. గుంటూరు కోర్టుకు ఈ కేసుపై అధికారం లేదని, ఇది విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు పరిధిలోకి వస్తుందని వాదించారు. అయితే అడ్వొకేట్ జనరల్, పిటిషనర్లు మరియు ఫిర్యాదు దారులు వేర్వేరు వ్యక్తులని, మూడో వ్యక్తులకు రివిజన్ పిటిషన్ వేసే హక్కు లేదని వాదిస్తూ కేసును కొట్టివేయాలని కోరారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!