

సిద్దిపేటలో కాంగ్రెస్ నేతలు తన భూములను పరిశీలించేందుకు వస్తున్నారన్న ప్రచారంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు స్పందించారు. వందలాది మంది పోలీసులు, బుల్లెట్ప్రూఫ్ వాహనాలు, రోప్ పార్టీలు, డ్రోన్లతో హడావుడి చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తాను సిద్దిపేటలోనే ఉన్నానని, తనకు సమాచారం ఇస్తే స్వయంగా అన్ని ఏర్పాట్లు చేస్తానని అన్నారు. సిద్దిపేటకు వచ్చే వారికి కడుపునిండా భోజనం పెట్టి, తన భూములు, తోటలను దగ్గరుండి చూపిస్తానని వ్యాఖ్యానించారు. తన జీవితం తెరిచిన పుస్తకమని, ఎన్నికల అఫిడవిట్లలో భూములు, ఆస్తుల వివరాలను సర్వే నంబర్లతో సహా వెల్లడించానని చెప్పారు.
రామంచలలో తనకు 13 ఎకరాల భూమి ఉంటే, లేని భూములను కూడా ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారని హరీశ్రావు ఆరోపించారు. తాను ఎలాంటి భూములను దాచలేదని, కొత్తగా బయటపెట్టాల్సిన అంశం ఏమీ లేదని అన్నారు. ప్రజల సొమ్మును దోచుకోలేదని, తన పని చూసే సిద్దిపేట ప్రజలు తనను పలుమార్లు గెలిపించారని పేర్కొన్నారు. సిద్దిపేట ప్రేమ, ఆప్యాయత, ఆతిథ్యానికి చిరునామా అని, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో పోలీసులను వెంటబెట్టుకుని భయపడుతూ రావాల్సిన అవసరం లేదని హరీశ్రావు అన్నారు. ఇటీవలి కాలంలో సిద్దిపేటలో హరీశ్రావు, కేసీఆర్ ఆస్తులపై నిష్పక్షపాత విచారణకు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేసినట్లు స్థానిక మీడియా నివేదికలు పేర్కొన్నాయి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!