

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్కు ఫిఫా తొలి ‘శాంతి బహుమతి’ ప్రకటించడంతో ప్రపంచ ఫుట్బాల్ సమాజంలో చర్చలు ముమ్మరమయ్యాయి. వాషింగ్టన్ డీసీలోని కెన్నడీ సెంటర్లో ఫిఫా ప్రపంచకప్ 2026 డ్రా కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ట్రంప్ను ఆహ్వానించిన ఫిఫా అధ్యక్షుడు గియాని ఇన్ఫాంటినో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని ట్రంప్కు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రపంచకప్ ట్రోఫీని కూడా ఆవిష్కరించారు.
ఫిఫా ఈ సంవత్సరం నుంచి శాంతి బహుమతిని ప్రవేశపెట్టింది. ఫుట్బాల్ ప్రపంచాన్ని ఏకం చేయడంలో, అంతర్జాతీయ శాంతి కోసం పని చేసే వ్యక్తులను గుర్తించడమే ఈ బహుమతి యొక్క ప్రధాన ఉద్దేశ్యమని ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల మంది అభిమానులను ప్రతినిధిగా భావించి ఈ బహుమతిని అందజేస్తున్నామని ఇన్ఫాంటినో పేర్కొన్నారు.
అయితే ట్రంప్కు ఈ అవార్డు ప్రకటించడంతో రాజకీయ కోణం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ యుద్ధాలు, ఘర్షణలను నివారించడంలో ట్రంప్ పాత్ర కీలకమని ఇన్ఫాంటినో ప్రశంసించగా, ఈ నిర్ణయం పలు వర్గాల్లో విమర్శలను కూడా తెచ్చుకుంది.
పురస్కారాన్ని అందుకున్న తరువాత ట్రంప్ తన ప్రసంగంలో, ఈ అవార్డు నా జీవితంలో గొప్ప గౌరవాలలో ఒకటి. అవార్డుల కోసం నేను పనిచేయలేదు. నా దౌత్య చర్యల ద్వారా లక్షలాది మంది ప్రాణాలను కాపాడాను. కాంగోలో శాంతి ఒప్పందం అందుకు ఒక ఉదాహరణ. అలాగే ఇండియా–పాకిస్థాన్ మధ్య యుద్ధ వాతావరణాన్ని కూడా నివారించాను అని పేర్కొన్నారు.
ఒకవైపు నోబెల్ శాంతి బహుమతి కోసం ఆశపడ్డ ట్రంప్, చివరికి అవార్డు మరియా కొరినా మచాదోకు వెళ్లడంతో నిరాశ చెందిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో ఫిఫా ఈ బహుమతిని ప్రకటించడంతో కొత్త వివాదం చెలరేగింది. హ్యూమన్ రైట్స్ వాట్ సంస్థ ఫిఫాపై విమర్శలు చేస్తూ, అవార్డు ఎంపిక పక్రియ పారదర్శకంగా లేదని, నామినీలు, జూరీ సభ్యులు లేని పరిస్థితిలో ఈ నిర్ణయం సరైనదా అని ప్రశ్నించింది.
అంతేకాక, ఫిఫా ప్రపంచకప్ 2026 జూన్ 11 నుంచి ప్రారంభం కానుంది. ఈసారి మెక్సికో, అమెరికా, కెనడా ఆతిథ్య దేశాలుగా వ్యవహరిస్తున్నాయి. తొలి మ్యాచ్లో మెక్సికో, దక్షిణాఫ్రికా తలపడనున్నాయి. జూలై 19 న న్యూజెర్సీలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఫిఫా చరిత్రలో తొలిసారి 48 జట్లు గ్రూప్ స్టేజీలో పోటీపడుతున్నాయి. 12 గ్రూపులుగా విభజించిన ఈ టోర్నీలో ఇప్పటికే 42 జట్లు అర్హత సాధించగా, మిగతా ఆరు స్థానాల కోసం 22 జట్లు పోటీలో ఉన్నాయి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!