

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణలో తుఫాన్ సమయంలో జరిగిన భారీ నష్టాన్ని పూర్తిగా ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే భావించామని, ఆంధ్రప్రదేశ్ను ఎప్పుడూ తప్పుపట్టలేదని ఆయన స్పష్టం చేశారు. అయితే కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడాన్ని “తెలంగాణ వాళ్ల దిష్టి తగిలింది” అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు వివేకవంతమైనవా లేదా అవివేకవంతమైనవా అనేది ప్రజలే నిర్ణయించాలన్నారు. బీజేపీ మిత్రపక్షం కాబట్టి ఆ పార్టీ తెలంగాణ నాయకత్వం ఈ వ్యాఖ్యలపై స్పందించాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు.
రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తేలా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో తుఫాను వచ్చినప్పుడు హుస్నాబాద్ కూడా మునిగిపోగా, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మేమెప్పుడూ తప్పుపట్టలేదని గుర్తుచేశారు. కానీ ఎక్కడెక్కడో చెట్లు ఎండిపోతే దాన్ని తెలంగాణ దిష్టిగా ముద్ర వేయడం తెలంగాణ ప్రజలకు అవమానకరమని అన్నారు. వెంటనే పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని సూచించారు. భవిష్యత్తులో ఇలాంటి వివక్షపూరిత, బాధ్యతలేని వ్యాఖ్యలు చేయకుండా, ఉప ముఖ్యమంత్రిగా మరింత విజ్ఞతతో వ్యవహరించాలని కోరారు. రెండు రాష్ట్రాలు కలిసి దేశ అభివృద్ధిలో ముందుకు సాగాలని, ప్రజా ప్రతినిధులు మాటల్లో జాగ్రత్త వహించాలని అన్నారు.
అదే సందర్భంలో MP చామల కిరణ్ రెడ్డి కూడా స్పందిస్తూ, “పవన్ కళ్యాణ్ గారు, ఇది సినిమా కాదు; చదివి మాట్లాడే రెండున్నర గంటల స్క్రిప్ట్ కాదు. డిప్యూటీ సీఎం అన్న పదవిని మరిచిపోయి మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది. మీరు గెలిచిన తర్వాత కోనసీమకు దిష్టి తగిలిందని చెప్పడం సరైంది కాదు. అక్కడి అసలు సమస్యలపై మాట్లాడండి; ఇస్తున్నట్టు మాట్లాడటం ఆపండి” అని వ్యాఖ్యానించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!