

మహిళల గౌరవం, ఆత్మప్రతిష్ఠ కోసం తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున చీరల పంపిణీ చేపట్టింది. కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. బుధవారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన సీఎం, మొదటిగా లబ్ధిదారులకు చీరలు అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రేవంత్రెడ్డి, మహిళల ఆత్మగౌరవాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. గ్రామీణ ప్రాంతాల్లో డిసెంబర్ 9 వరకు, పట్టణ ప్రాంతాల్లో మార్చి 1 నుంచి 8 వ తేదీ మహిళా దినోత్సవం వరకు చీరలను పంపిణీ చేస్తాం. అర్హులైన ప్రతి మహిళకు తప్పకుండా చీర అందుతుంది, ఎవ్వరూ ఆందోళన చెందవద్దు, అని తెలిపారు.
ఇందిరాగాంధీ దేశానికి అందించిన సేవలను సీఎం ప్రత్యేకంగా స్మరించారు. రాజకీయ శూన్యత ఉన్న సమయంలో ప్రధాని బాధ్యతలు స్వీకరించిన ఇందిరమ్మ బ్యాంకుల జాతీయీకరణ, భూముల పంపిణీ, పేదలకు ఇళ్లు వంటి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారని కొనియాడారు. పాకిస్థాన్ యుద్ధ సమయంలో దేశాన్ని ధైర్యంగా నడిపించిందని ప్రశంసించారు.
మా ప్రభుత్వం పూర్తిగా ఇందిరమ్మ స్ఫూర్తితో ముందుకు సాగుతోంది. మహిళలకు పెట్రోల్ బంకులు ఇచ్చాము, ఆర్టీసీలో వెయ్యి బస్సులకు మహిళలను యజమానులుగా చేశాము. ఆడబిడ్డల పేరుతోనే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నాం. కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం, అని రేవంత్రెడ్డి చెప్పారు.
చీరల ఉత్పత్తికి సమయం కావడంతో రెండు విడతలుగా పంపిణీ చేస్తున్నామని, మొదటి విడతలో 65 లక్షల చీరలు అందజేస్తామని ఆయన తెలిపారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు, మహిళా అధికారులు ఇందిరమ్మ చీర ధరించాలని, మహిళల ఆత్మగౌరవానికి బ్రాండ్ అంబాసిడర్లుగా మారాలని సీఎం పిలుపునిచ్చారు.







.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!