

బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సీఎం రేవంత్రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్రెడ్డి రాష్ట్రానికి చీడపీడలా మారారని ఆరోపించారు. సంగారెడ్డిలో నిర్వహించిన సభ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా సాగిందని, స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం కూడా ఇవ్వలేదన్నారు. సీఎం తనను మాత్రమే కాకుండా సంగారెడ్డి ప్రజలను కూడా అవమానించారని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంగారెడ్డిలో సీఎం బజారు భాష ఉపయోగించారని, ఆయన పర్యటన సందర్భంగా ముందస్తు అరెస్టులు చేశారని ఆరోపించారు.
ముఖ్యమంత్రి హోదాలో ఉండి క్షుద్ర పూజలు, మూఢనమ్మకాల గురించి మాట్లాడటం సరికాదని చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డిలో ఓడిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యేను పక్కన పెట్టుకుని రేవంత్రెడ్డి ఎన్నికల ప్రచారంలా వ్యవహరించారని విమర్శించారు. జగ్గారెడ్డి పనితీరు అంత గొప్పగా ఉంటే సంగారెడ్డి ప్రజలు ఎందుకు ఓడించారని ప్రశ్నించారు. ఆయనపై భూకబ్జాలకు పాల్పడుతున్నారంటూ ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకెంతకాలం కొనసాగుతుందో తెలియదని వ్యాఖ్యానిస్తూ, రేషన్, స్మార్ట్ కార్డులపై సీఎం, మంత్రుల ఫొటోలు పెట్టడంపై కూడా ప్రశ్నలు సంధించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!