

తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాష్ట్ర బడ్జెట్ ప్రతి పౌరుడు అభివృద్ధిలో భాగస్వామి అయ్యేలా రూపొందిస్తామని తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ మరియు తెలంగాణ శాసన మండలి సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ఆయన, ప్రతి వర్గానికి అభివృద్ధి ఫలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కష్టపడే తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజా కేంద్రిత పాలన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. విజన్-2047 ద్వారా రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు రోడ్మ్యాప్ సిద్ధం చేశామని, రాష్ట్ర తలసరి ఆదాయం ప్రస్తుతం రూ.4.18 లక్షలకు చేరిందని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి క్యూర్, ప్యూర్, రేర్ మోడళ్లను అమలు చేస్తున్నామని గవర్నర్ చెప్పారు. పట్టణాభివృద్ధికి క్యూర్ మోడల్ను అనుసరిస్తున్నామని, 2031 నాటికి పట్టణ జనాభా 53.8 శాతానికి చేరుతుందని అంచనా వేశారు. ఇటీవల జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని నాలుగు కమిషనరేట్లుగా విభజించామని తెలిపారు. 23వ బయో ఆసియా సదస్సు ద్వారా రూ.1700 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, హైదరాబాద్ గ్లోబల్ టెక్ హబ్గా ఎదుగుతోందని చెప్పారు. ఐటీ ఎగుమతులు రూ.3.13 లక్షల కోట్లకు చేరి 9.39 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నాయని తెలిపారు. రైతు భరోసా కింద రూ.8,744 కోట్లు, పంట రుణమాఫీ కోసం రూ.20,616 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కొత్తగా 15.12 లక్షల రేషన్ కార్డులు జారీ చేసి, మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు లాభం చేకూరిందన్నారు. రికార్డు సమయంలో 67,763 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, డ్రగ్స్ సమస్యను అరికట్టేందుకు ఈగల్ ప్రత్యేక బృందం పనిచేస్తోందని పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!