

ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్తో కీలక సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాష్ట్రంలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, కేంద్ర ఆర్థిక సాయం, అలాగే అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపై విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్, తాగునీటి భద్రత దృష్ట్యా ఈ అంశాలు అత్యంత ప్రాధాన్యత కలవని ముఖ్యమంత్రి వివరించారు. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సాయంపై పెండింగ్లో ఉన్న అంశాలను కూడా ఆయన ప్రస్తావించారు.
సమావేశంలో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టుపై విధించిన స్టాప్ వర్క్ ఆర్డర్ను శాశ్వతంగా ఎత్తివేయాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ ఆదేశాల వల్ల ప్రాజెక్టు అమలులో తీవ్ర అవరోధాలు ఏర్పడుతున్నాయని తెలిపారు. కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపుతో పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్ చేయాలని, ఫేజ్ – II పనుల కోసం భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టల నిర్మాణానికి అదనంగా సుమారు రూ.32,000 కోట్ల ఆర్థిక సహాయం అవసరమని స్పష్టం చేశారు. అలాగే పోలవరం–నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు జాతీయ నదుల అనుసంధాన విధానంలో అనుమతులు ఇవ్వాలని, వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ తుది నివేదికను గెజెట్లో ప్రచురించి నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని కోరారు. గోదావరి జలాల పంపకంపై ఏపీ – తెలంగాణ మధ్య వివాద పరిష్కారానికి గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలని, ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపుపై కర్ణాటక చర్యలను తీవ్రంగా వ్యతిరేకించారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!