

తెర మీద తొలి కాంతి పుడుతుండగానే, దాని కన్నా ముందు ప్రేక్షకుల హృదయాలను స్పృశించేవి సావిత్రి కళ్లే. కథ మొదలయ్యేలోపే ఆమె కళ్లలోని నవ్వులు, వేదనలు ప్రేక్షకుల హృదయాల్లో చోటు చేసుకునేవి. పాత్రలను ఆమె ధరించేది కాదు ఆ పత్రాల్లా ఆమె శ్వాసించేది, జీవించేది.
మాయాబజార్లో ఆమె చిరునవ్వు తెలుగు పండుగల దీపం లాంటిది. మిస్సమ్మలో ఆమె నడక చిన్నప్పుడు అమ్మ పట్టుకున్న చేయి మరలా మనసుకు గుర్తుచేసేలా ఉంటుంది. సావిత్రికి దుఃఖం అలంకారం కాదు ఆమె జీవితపు నిజం.
సావిత్రి కళ్లలో మెరుస్తున్న ప్రతి భావం—స్త్రీ జీవితంలోని సహనం, మౌనం, వెలుగు–చాయల కలయిక. తెరలు మారినా, కాలం గడిచినా, సావిత్రి ఇంకా మనలోనే జీవిస్తోంది. నాకైతే స్మితాపాటిల్ తర్వాత అత్యంత భావోద్వేగ నటన సావిత్రిదే.
ఆమె ముఖంలో వచ్చే భావాలు గులాబీ పువ్వుల్లా సహజం, వాటి పరిమళాల్లా హాయిగా ఉంటాయి. ఆమె మూతి విరుపులో కనిపించే విన్యాసం భావాల ప్రపంచాన్ని అలవోకగా చూపించేది.
ఎనభైకి పైగా సినిమాలు చేసినప్పటికీ రెండు భాషల్లోనూ ఆమె సాధించిన ప్రభావం చిరస్థాయిగానే నిలిచింది.
తెలుగు–తమిళ ప్రేక్షకుల మనస్సుల్లో సావిత్రి స్థానం అందాలకే కాదు, నటనకూ అచంచలమైనది. ఆమె పలుకుల్లో కనిపించే సరళత్వం, అభినయంలో ఒదిగే సహజత్వం ప్రత్యేకమైనవి.
అమాయకత అయినా, చలాకీతనం అయినా, సంతోషం లేదా దుఃఖం ఏ భావమైనా సావిత్రి ఒక్క చూపుతో అద్భుతంగా ఆవిష్కరించేది.
మిస్సమ్మ, బతుకుతెరువు, దేవదాసు, అర్ధాంగి, దొంగరాముడు, మాయాబజార్, మాంగల్యబలం, నర్తనశాల ఇలా సామాజిక, పౌరాణిక చిత్రాల్లో ఆమె నటన అజరామరమైంది.
జీవితంలోని సంక్లిష్టతలు, బాధలను స్వీకరించి వాటిని కళగా మార్చిన అరుదైన నటి సావిత్రి.
1935 డిసెంబర్ 6న కృష్ణా జిల్లాలోని చిర్రావూరులో జన్మించిన ఆమె చిన్నప్పటి నుంచే నృత్యంలో శిక్షణ పొందింది. 1950లో మద్రాస్ చేరుకొని సినీ ప్రయాణం మొదలుపెట్టింది.
వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన దేవదాసు ఆమె ప్రతిభను గుర్తించిన తొలి చిత్రం. ప్రతి పాత్రతో ఆమె ప్రయాణం మరింత బలపడింది.
ఎల్వీ ప్రసాద్ తీసిన మిస్సమ్మ ఆమె కెరీర్కు మలుపుమార్పు తీసుకువచ్చింది. ఆ తర్వాత మాయాబజార్లో శశిరేఖ పాత్రతో ఆమె మహానటిగా నిలిచిపోయింది.
సావిత్రి నటించిన వెలుగునీడలు, మూగమనసులు, డాక్టర్ చక్రవర్తి, సుమంగళి వంటి చిత్రాలు ఆమెకు నటిగా శాశ్వత గుర్తింపును తెచ్చాయి.
దర్శకురాలిగా చిన్నారి పాపలు, మాతృదేవత, వింత సంసారం, ప్రాప్తం వంటి చిత్రాలను రూపొందించింది. నిర్మాతగానూ తన కృషి చూపింది.
తన జీవితాన్నే కళగా మార్చుకున్న మహానటి చివరికి తన జీవిత పోరాటంలో ఓడిపోయింది. కానీ తెరపై ఆమె వేసిన ముద్ర మాత్రం చిరస్థాయిగా నిలిచిపోయింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!