

ఫోక్ సింగర్ నాగవ్వ పాడిన ‘బాయిలోనే బల్లిపలికే’ పాట యూట్యూబ్లో ట్రెండింగ్గా మారి ఆమెకు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ పాట వెనుక ఉన్న కథను నాగవ్వ వెల్లడించింది. ఈ పాట తన అమ్మమ్మ నుంచి వచ్చిన సంప్రదాయ పాట అని, బల్లి పలకడం శుభానికి సంకేతమనే నమ్మకంతోనే ఇది రూపుదిద్దుకుందని చెప్పింది. పూర్వకాలంలో దొంగల భయంతో ప్రజలు బంగారం, వెండి వంటి సంపదను బావుల్లో దాచేవారని, బల్లి పలికిన చోట తవ్వితే ఆ సంపద బయటపడేదన్న నమ్మకమే ఈ పాటకు నేపథ్యమని వివరించింది.
జగిత్యాల జిల్లా ఎనాపల్లి మండలం గుళ్ళకోట గ్రామానికి చెందిన నాగవ్వ వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తోంది. పొలం పనుల అలసటను మరిచేందుకు, చుట్టూ ఉన్నవారిని ఉత్సాహపరచేందుకు ఆమె ఫోక్ పాటలు పాడేది. ఈ పాటతో ఆమె ఒక్కసారిగా స్టార్గా మారింది. నాగవ్వ కొడుకు తిరుపతి రెడ్డి ఈ పాట కోసం ఎంతో కష్టపడ్డాడని, లిరిసిస్ట్, దర్శకుడిగా ఎదగాలనే ఆశ ఉందని ఆమె తెలిపింది.
మంగ్లీ, దామోదర్ రెడ్డి సహకారంతో ఈ పాటకు మొదట సినిమా అవకాశం వచ్చినా, చివరకు ప్రత్యేక వీడియోగా రూపొందించారు. మూడు సంవత్సరాల ఎదురుచూపుల తర్వాత ఈ పాట విడుదలైంది. రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేసి, సుమారు 150 మంది సాంకేతిక నిపుణులతో మూడు రోజుల్లో గ్రాండ్గా షూటింగ్ పూర్తి చేశారు. విడుదలైన నెల రోజుల్లోనే 70 మిలియన్లకు పైగా వ్యూస్ రావడంతో పాటు, రోజుకు సగటున 1 మిలియన్ వ్యూస్ వస్తున్నాయని, పెట్టుబడి దాదాపుగా తిరిగొచ్చిందని నాగవ్వ తెలిపింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!