

విజయవాడ లెనిన్ సెంటర్లో జరిగిన కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఘట్టమనేని జయకృష్ణ మాట్లాడారు. తాను ఇంకా ఒక్క సినిమా కూడా చేయకపోయినా ప్రజలు తనను అభిమానిస్తుంటే అది పూర్తిగా తాత కృష్ణ గారి ఆశీర్వాదమేనని అన్నారు. జీవితంలో తాను చేసే ప్రతి పనిలోనూ తాత తన పక్కనే ఉండి మార్గనిర్దేశం చేస్తున్నట్లు అనిపిస్తుందని చెప్పారు. ఆయన గర్వపడేలా ఉండటమే తన జీవిత లక్ష్యమని తెలిపారు. ఈ విగ్రహాన్ని పద్మాలయ సంస్థ అధినేత ఘట్టమనేని ఆదిశేషగిరిరావు మరియు జయకృష్ణ కలిసి ఆవిష్కరించారు.
తన జీవితంలో మరో ముఖ్యమైన వ్యక్తి తన బాబాయి మహేశ్ బాబు అని జయకృష్ణ పేర్కొన్నారు. మహేశ్ బాబు సినిమాలు చూస్తూ తాను పెరిగానని, ఆయనకు తాను పెద్ద అభిమానినని చెప్పారు. తన తొలి సినిమా ఫస్ట్ లుక్ను మహేశ్ బాబే విడుదల చేశారని తెలిపారు. 40 ఏళ్ల క్రితం కృష్ణ గారి అగ్నిపర్వతం సినిమాను నిర్మాత అశ్వనీదత్ నిర్మించారని, 1999 లో మహేశ్ బాబును ఆయనే పరిచయం చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు తనను నమ్మి తనను కూడా లాంచ్ చేయడం ఆనందంగా ఉందన్నారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తాను హీరోగా శ్రీనివాస్ మంగాపురం సినిమా తెరకెక్కుతోందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు, వెనిగండ్ల రాము, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నిర్మాత అశ్వనీదత్, దర్శకుడు అజయ్ భూపతి తదితరులు పాల్గొన్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!