

మంచు మనోజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ చిత్రం ‘డేవిడ్ రెడ్డి’ మరో కీలక దశను పూర్తి చేసుకుంది. ఇటీవల ప్యాచ్వర్క్ చిత్రీకరణ పూర్తికాగా, ఇప్పటికే తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలను మరింత నాణ్యతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో రీషూట్ చేసినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రక్రియపై హీరో మంచు మనోజ్ ప్రత్యేక శ్రద్ధ చూపినట్లు సమాచారం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన ఓ ధైర్యవంతుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని భారీ నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు.
హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చారిత్రక నేపథ్యానికి యాక్షన్ అంశాలను జోడించి ఆసక్తికరంగా మలుస్తున్నారు. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా 700 కేజీల బరువుతో రూపొందించిన ‘వార్ డాగ్’ అనే ప్రత్యేక బైక్ కనిపించనుంది. కథలో ఈ వాహనం కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. మంచు మనోజ్ సరసన మరియా కథానాయికగా నటిస్తుండగా, భారీ సెట్స్, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!